రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు | Rs 750 Crore GST Notices To Zomato Swiggy | Sakshi
Sakshi News home page

రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు

Nov 22 2023 6:22 PM | Updated on Nov 22 2023 7:34 PM

Rs 750 Crore GST Notices To Zomato Swiggy - Sakshi

దిగ్గజ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) నోటీసులు జారీ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం.. జొమాటో, స్విగ్గీ వరుసగా రూ.400 కోట్లు, రూ.350 కోట్ల విలువైన జీఎస్టీ నోటీసులు అందుకున్నాయి. ఫుడ్ డెలివరీ అనేది ఒక సర్వీస్‌ కాబట్టి దాని ట్యాక్స్‌స్లాబ్‌కు తగినట్లు జొమాటో, స్విగ్గీ జీఎస్టీ చెల్లించాలని డీజీజీఐ తెలిపింది.

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గీ డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేస్తాయి. 'డెలివరీ ఛార్జీ' అనేది ఇంటింటికీ ఆహారాన్ని తీసుకెళ్లే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు. కంపెనీలు ఆ ధరను కస్టమర్ల నుంచి సేకరించి వారి డెలివరీ భాగస్వాములకు అందిస్తాయి. అయితే ఈ విషయంలో జీఎస్టీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

2022లో స్విగ్గీ, జొమాటో తమ ఆర్డర్‌లపై 5 శాతం రేటుతో పన్ను వసూలు చేసి జమ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అంతకు ముందు జీఎస్టీ కింద నమోదైన రెస్టారెంట్లు మాత్రమే పన్ను వసూలు చేసి జమ చేసేవి. గత నెలలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్‌ల ప్లాట్‌ఫారమ్ చార్జీను రూ.2 నుంచి రూ.3కి పెంచింది. జొమాటో షేర్లు బుధవారం 1.07 శాతం నష్టపోయి రూ.115.25 వద్ద ముగిశాయి.

Advertisement
 
Advertisement
Advertisement