
మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 6,000 మంది ఉద్యోగులను, అంటే దాని ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 3 శాతం మందిని తొలగించింది.. అసలు కంపెనీ ఇంతమందిని ఎందుకు తొలగించింది అనే విషయాన్ని సీఈఓ సత్యనాదెళ్ళ వివరించారు.
ఇటీవల ఉద్యోగులతో జరిగిన టౌన్ హాల్ సమావేశంలో సత్యనాదెళ్ళ మాట్లాడుతూ.. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం పనితీరు సరిగ్గా లేకపోవడం కాదు. సంస్థ పునర్వ్యవస్తీకరణలో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
పోటీ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ తన కోపైలెట్ ఏఐ అసిస్టెంట్లను మరింత వేగంగా వినియోగదారులకు చేర్చడం మీద కూడా దృష్టి సారించింది. దీనికోసం కొన్ని సంస్థలతో.. ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. ఏఐ టూల్స్ వాడకం మాత్రమే కాకుండా.. ఇందులో ఉద్యోగులకు సైతం శిక్షణ ఇవ్వాల్సిన ఉందని సత్యనాదెళ్ళ వివరించారు.
మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ఏఐ మౌలిక సదుపాయాలలో 80 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇందులో ఏఐ సామర్థ్యాలను విస్తరించడం మాత్రమే కాకుండా.. వివిధ ప్లాట్ఫామ్లు, సేవలలో దాని కోపైలట్ ఏఐ అసిస్టెంట్లను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి.
ఇదీ చదవండి: టాటా గ్రూప్లో కీలక పరిణామం: చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా
మైక్రోసాఫ్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ 'అపర్ణ చెన్నప్రగడ' కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు. కోడింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అధ్యయనం వాడుకలో లేకుండా పోతుందనే ఆలోచనలను గురించి మాట్లాడుతూ.. "కంప్యూటర్ సైన్స్ చదవకూడదనే లేదా కోడింగ్ చనిపోయిందనే భావన ఏ మాత్రం సరైంది కాదు, ఇందులో ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదని.. భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆమె భరోసా ఇచ్చారు.