రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు | Positive Expectations: Stock Market Experts Views and Advice on this week | Sakshi
Sakshi News home page

రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు

Jul 15 2024 4:13 AM | Updated on Jul 15 2024 9:16 AM

Positive Expectations: Stock Market Experts Views and Advice on this week

క్యూ1 ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు  

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు  

మార్కెట్లో సెంటిమెంట్‌ సానుకూలమే 

ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా

ముంబై: దేశీయ కార్పొరేట్‌ కంపెనీల జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు, బడ్జెట్‌కు ముందు కొనుగోళ్లు అంశాల నేపథ్యంలో స్టాక్‌ సూచీల రికార్డుల ర్యాలీ ఈ వారమూ కొనసాగొచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల క్రయ, విక్రయాలు సూచీలకు దిశానిర్దేశం చేస్తాయంటున్నారు. 

వీటితో పాటు రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరలు, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు.  మొహర్రం సందర్భంగా బుధవారం (జూన్‌ 17న) ఎక్సే్చంజీలకు సెలవ కావడంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితమైంది.  
‘‘వృద్ధి ఆధారిత బడ్జెట్‌ ఉహాగానాలు, క్యూ1 ఆర్థిక ఫలితాలపై మిశ్రమ అంచనాల నడుమ మార్కెట్లో భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి ఎగువ స్థాయిలో 24,600 వద్ద నిరోధం ఉంది. దిగువున 24,150 – 24,200 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది. ఫలితాల సీజన్‌ సందర్భంగా స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌ జరగొచ్చు. రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నందున ఎఫ్‌ఎంసీజీ షేర్లకు డిమాండ్‌ లభించవచ్చు.’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణులు నాగరాజ్‌ శెట్టి తెలిపారు.  
గతవారం స్టాక్‌ సూచీలు దాదాపు ఒక శాతం ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్‌ 523 పాయింట్లు, నిఫ్టీ 178 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.  

జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావం 
మార్కెట్‌ ముందుగా గత వారాంతాన వెల్లడైన హెచ్‌సీఎల్‌ టెక్, డీమార్ట్‌ క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ ఇండెక్స్‌లో 36% వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్, బజాజ్‌ ఆటో, ఏసియన్‌ పేయింట్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆల్ట్రాటెక్‌ సిమెంట్, విప్రో, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, బీపీసీఎల్‌ కంపెనీలు తమ జూన్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. 

వీటితో పాటు జియో ఫైనాన్సియల్‌ సరీ్వసెస్, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్, ఏంజెల్‌ వన్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, స్పైస్‌జెట్, ఆదిత్య బిర్లా కంపెనీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హావెల్స్, ఎల్‌అండ్‌టీ సరీ్వసెస్, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్, పాలీక్యాబ్‌ ఇండియా, టాటా టెక్నాలజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, పేటీఎం, పీవీఆర్, యూనియన్‌ బ్యాంక్, ఆర్బీఎల్, యస్‌ బ్యాంక్‌ సహా మొత్తం 197 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.   

స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం  
దేశీయ జూన్‌ హోల్‌సేల్‌ ద్రవ్యల్బణ డేటా, చైనా క్యూ1 జీడీపీ, జూన్‌ రిటైల్‌ అమ్మకాలు, యూరోజోన్‌ మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(జూన్‌ 15న) విడుదల కానున్నాయి. మంగళవారం మే నెల యూరోజోన్‌ బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్, జూన్‌ అమెరికా రిటైల్‌ అమ్మకాల డేటా, బుధవారం బ్రిటన్‌ జూన్‌ ద్రవ్యోల్బణం, యూరోజోన్‌ జూన్‌ ద్రవ్యోల్బణం, అమెరికా జూన్‌ పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి కానుంది. 

గురువారం బ్రిటన్‌ మే నిరుద్యోగ గణాంకాలు, జపాన్‌ జూన్‌ బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ డేటా, యూరోజోన్‌ ఈసీబీ వడ్డీరేట్ల నిర్ణయం వెలువడునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఆర్‌బీఐ జూన్‌ 12తో ముగిసిన వారం ఫారెక్స్‌ నిల్వలు ప్రకటించనుంది. బ్రిటన్‌ జూన్‌ రిటైల్‌ అమ్మకాల డేటా, జపాన్‌ జూన్‌ ద్రవ్యోల్బణం, యూరోజోన్‌ మే కరెంట్‌ ఖాతాల గణాంకాలు వెలువడునున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.

రెండు వారాల్లో రూ.15వేల కోట్ల పెట్టుబడులు
విదేశీ ఇన్వెస్టర్లు జూలై తొలి రెండు వారాల్లో దేశీయ మార్కెట్లో రూ.15,352 కోట్ల పెట్టుబడి పెట్టారు. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, కొనసాగుతున్న సంస్కరణలు ఇందుకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ‘‘రాబోయే కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాలకు సంబంధించి ప్రోత్సహకాలు, రాయితీలు ఉండే అవకాశం ఉంది. అలాగే, అమెరికా ఫెడరల్‌ తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కూడా ఉన్నాయి. 

దీంతో విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీల్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లను జరుపుతున్నారు’’ అని మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్‌‡్ష శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు సమీక్షా కాలంలో డెట్‌ మార్కెట్‌లో ఎఫ్‌పీఐలు రూ.8,484 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ కొనుగోలుదారులతో పాటు దేశీయ కొనుగోలు దారులు సైతం 2024లో ఈక్విటీల్లో స్థిరమైన కొనుగోలుదారులుగా ఉన్నారు. ఎఫ్‌పీఐలు జనవరి, ఏప్రిల్, మే నెలల్లో రూ.60,000 కోట్లు ఉపసంహరించుకోగా, ఫిబ్రవరి, మార్చి, జూన్‌లలో కలిపి రూ.63,200 కోట్లు కొనుగోళ్లు జరిపారు.

బడ్జెట్‌పై ఆంచనాలు 
ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్‌ తరహాలోనే ఈసారి ఆర్థిక లోటు, రుణ లక్ష్యాలపై దృష్టి సారించవచ్చు. గ్రామీణ ఆర్థికావృద్ధిని బలోపేతం దిశగా సానుకూల ప్రకటనలు ఉండొచ్చు. తక్కువ ఆదాయ శ్రేణి వర్గాలకు పన్ను ప్రయోజనాలు ఉండొచ్చు. మూలధన వ్యయాలకు పెద్దపీట వేయవచ్చు. మొత్తంగా ప్రభుత్వ విధానాలు కొనసాగించే వీలుంది. బడ్జెట్‌ ఆధారిత వార్తలకు అనుగుణంగా ఆయా రంగాల షేర్లలో కదిలికలు ఉండొచ్చు.  

మొహర్రం సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement