ప్రస్తుత డిజిటల్ యుగంలో కిరాణా సరుకు లు, నిత్యావసర ఉత్పత్తులను ఆన్లైన్ యాప్లు, వెబ్సైట్ల ద్వారా ఆర్డర్ చేయడం సర్వసాధా రణమైంది. అయితే, డిజిటల్ వేదికలపై వస్తువుల ను ఎంచుకునే సమయంలో వాటి ‘బెస్ట్ బిఫోర్’ లేదా గడువు ముగిసే తేదీలు (ఎక్స్పైరీ డేట్లు) స్పష్టంగా కనిపించడం లేదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తువు చేతికి వచ్చే వరకు దాని కాలపరిమితి ఎంతో తెలియకపోవడంతో, గడువు దగ్గరపడిన ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి.
లోకల్సర్కిల్స్ సర్వేలో దిగ్భ్రాంతికర అంశాలు
సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు ‘లోకల్సర్కిల్స్’ అనే సంస్థ దేశవ్యాప్తంగా దాదాపు 20,000 మంది ఆన్లైన్ వినియోగదారులతో ఒక సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో దాదాపు 39 శాతం మంది కొనుగోలుదారులు తాము ఉపయోగించే అత్యధిక నిత్యావసరాల యాప్లు లేదా సైట్లలో గడువు తేదీలను కనుగొనలేకపోతున్నామని వెల్లడించారు. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 27 శాతం మంది మాత్రమే అన్ని యాప్లలో ఈ వివరాలు సరిగ్గా కనిపిస్తున్నాయని తెలిపారు. 33 శాతం మంది వినియోగదారులకు అసలు ఏ సైట్లోనూ ఈ తేదీలు కనిపించకపోవడం ఆన్లైన్ గ్రోసరీ, క్విక్–కామర్స్ ప్లాట్ఫారమ్లలో పారదర్శకత లోపాన్ని ఎత్తిచూపుతోంది.
అస్పష్టమైన వివరాలు.. లెక్కింపులో ఇబ్బందులు
ప్రముఖ బ్రాండ్లు, ఈ–కామర్స్ వేదికలు సైతం ఉత్పత్తులపై ‘తయారీ తేదీ నుంచి 6 నెలల వరకు ఉపయోగించవచ్చు’ అని మాత్రమే పేర్కొంటున్నాయి. అయితే, ఆ వస్తువు అసలు ఏ రోజున తయారైందో స్పష్టంగా ప్రదర్శించకపోవడం వల్ల, ఇంకా ఎంత కాలపరిమితి మిగిలి ఉందో వినియోగదారులు అంచనా వేయలేకపోతున్నారు. కేవలం షెల్ఫ్ లైఫ్ ఎంతో చెప్పి తయారీ తేదీని దాచడం వల్ల వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉంది.
చట్టాలు, నిబంధనలు ఏం చెబుతున్నాయి?
లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనలు–2011 (2017 సవరణ) ప్రకారం.. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు కొనుగోలుదారులు ఆర్డర్ చేయడానికి ముందే వస్తువుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను డిజిటల్గా ప్రదర్శించాలి. ఇందులో ‘బెస్ట్ బిఫోర్’ లేదా ‘యూజ్ బై’ తేదీలు తప్పనిసరి. ఈ నిబంధనలు థర్డ్–పార్టీ ఈ–కామర్స్ మార్కెట్æప్లేస్లతో పాటు బ్రాండ్ల సొంత వెబ్సైట్లకు కూడా సమానంగా వర్తిస్తాయి.
కఠిన చర్యలకు సిద్ధమౌతున్న అధికారులు
వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ.), లీగల్ మెట్రాలజీ విభాగాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ. ప్రకారం, ఆన్లైన్ వేదికల ద్వారా డెలివరీ అయ్యే ఆహార ఉత్పత్తులకు కనీసం 30 శాతం షెల్ఫ్–లైఫ్ లేదా కనీసం 45 రోజుల గడువు మిగిలి ఉండటం తప్పనిసరి. ఈ పారదర్శకతను పెంచేందుకు ఆన్లైన్ సంస్థలపై అధికారులు ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నారు.


