
క్యూ4లో రూ. 6,448 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గతేడాది (2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 35% క్షీణించి రూ. 6,448 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 9,869 కోట్లు ఆర్జించింది. ముడిచమురు ఉత్పత్తి, రిఫైనరీలకు విక్రయంపై ఒక్కో బ్యారల్కు 73.72 డాలర్ల చొప్పున లభించినట్లు కంపెనీ పేర్కొంది.
అంతక్రితం క్యూ4లో 80.81 డాలర్లు చొప్పున అందుకుంది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 34,982 కోట్లను తాకింది. ఈ కాలంలో యథాతథంగా 4.7 మిలియన్ టన్నుల (ఎంటీ) చమురు ఉత్పత్తి చేసింది. సహజవాయు ఉత్పత్తి సైతం 4.951 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) నుంచి 4.893 బీసీఎంకు స్వల్పంగా మందగించింది.
పూర్తి ఏడాదికి చూస్తే...
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఓఎన్జీసీ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 35,610 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం యథాతథంగా రూ. 1.37 లక్షల కోట్లకు చేరింది. చమురు ధరలు 5 శాతం తక్కువగా బ్యారల్కు 76.9 డాలర్లు చొప్పున లభించాయి. గ్యాస్ విక్రయాలపై ఒక్కో ఎంబీటీయూకి 6.5 డాలర్లు చొప్పున అందుకుంది. స్టాండెలోన్ చమురు ఉత్పత్తి 18.558 ఎంటీకి చేరగా.. సహజవాయు ఉత్పత్తి 19.654 బీసీఎంగా నమోదైంది. గత 35ఏళ్లలోనే అత్యధికంగా 578 బావులలో తవ్వకాలు చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. 2023– 24లో 544 బావులలో తవ్వకాలు సాగించింది. ఈ కాలంలో మొత్తం రూ. 62,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచింది.
ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు బీఎస్ఈలో 3% నష్టంతో రూ. 242 వద్ద ముగిసింది.