లక్కు తెచ్చిన డొక్కు చెక్కకుర్చీ.. రూ.500 పెట్టి కొంటే రూ.16 లక్షలపైనే వచ్చాయ్
Wooden Chair Bought From Junk Shop Brings Luck For UK Lady: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. ‘టకాటకా’మని బాదినప్పుడే తలుపు తీయాలి. ఓ మహిళ అలా చేసింది కాబట్టే ఇంట కాసుల వర్షం కురిసింది. జంక్ షాపులో కొన్న ఓ పాత కుర్చీ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎలాగో ఇది చదవండి..
ఈస్ట్ సస్సెక్స్(యూకే) బ్రిగ్టన్కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఆమధ్య ఓ కుర్చీ కొనుక్కుంది. దాని ధర 5 పౌండ్లు(మన కరెన్సీలో 500రూ. దాకా). అయితే అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు. పాత సామాన్లపై ఆసక్తి ఉన్న ఓ దగ్గరి బంధువు ఆ కుర్చీ మీద వేసిన డేట్ చూశాడు. స్టడీ చేసి దాని గొప్పతనం గురించి చెప్పడంతో ఆమె దానిని వేలంపాటకు తీసుకెళ్లింది. వేలంలో ఆమెకు 16, 250 పౌండ్లు వచ్చాయి. మన కరెన్సీలో దాని విలువ రూ. 16 లక్షల 40 వేల రూపాయలకు పైనే.
ఆ కుర్చీ 20వ శతాబ్దంలో వియన్నా(ఆస్ట్రియా) ఎవంట్ గార్డే ఆర్ట్ స్కూల్కి చెందిందట. ఆస్ట్రియన్ పెయింటర్ కోలోమన్ మోసర్ 1902లో దానిని డిజైన్ చేశాడట. కోలోమన్ సంప్రదాయ శైలిలను వ్యతిరేకిస్తూ.. మోడ్రన్ ఆర్ట్ వర్క్ ద్వారా ఆస్ట్రియాలో పేరు సంపాదించుకున్నారు. నిచ్చెన తరహా స్టైల్లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీనీ రూపొందించారాయన.
ఇదంతా తెలిశాక ఆ మహిళ ఆ పాత కుర్చీతో ఎస్సెక్స్లోని స్వోడర్స్ యాక్షనీర్స్ ఆఫ్ మౌంట్ఫిట్చెట్ వాళ్లను సంప్రదించింది. వాళ్లు దానిని వేలం వేయగా.. ఆస్ట్రియాకు చెందిన ఓ డీలర్ దానిని 16,250 పౌండ్లు చెల్లించి దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే.. 120 ఏళ్లు గడుస్తున్నా కుర్చీ ఇంకా ఒరిజినల్ కండిషన్లోనే ఉండడం.