ఒక్కరోజులో అదానీకి చెక్‌! తిరుగులేని ముఖేష్‌ అంబానీ.. | Mukesh Ambani Surpasses Gautam Adani Becomes Asias Richest Person | Sakshi
Sakshi News home page

ఒక్కరోజులో అదానీకి చెక్‌! తిరుగులేని ముఖేష్‌ అంబానీ..

Jan 12 2024 8:26 PM | Updated on Jan 12 2024 8:48 PM

Mukesh Ambani Surpasses Gautam Adani Becomes Asias Richest Person - Sakshi

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. సంపదలో మళ్లీ తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించి గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో గతంలో 13వ స్థానానికి పడిపోయిన ముఖేష్‌ అంబానీ శుక్రవారం (జనవరి 12) 102 బిలియన్ డాలర్ల (రూ.8.4 లక్షల కోట్లు) నికర సంపదతో భారతదేశపు అత్యంత సంపన్నుడిగా మారారు.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అంబానీ తన నెట్‌వర్త్‌కు 24 గంటల్లో దాదాపు 3 బిలియన్‌ డాలర్లు (రూ.24 వేల కోట్లు)  జోడించారు. గురువారం భారతీయ స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ షేర్లు ర్యాలీ చేయడంతో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. గతేడాది క్యూ3 ఫలితాలు వెల్లడించిన తర్వాత 2023 అక్టోబర్‌ నుంచి   రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్ల విలువ 22 శాతం పెరిగింది. కంపెనీలో ముఖేష్ అంబానీకి 42 శాతం వాటా ఉంది. షేర్ ధర పెరిగిన తర్వాత ఆయన సంపద గణనీయంగా పెరిగింది.

అదానీని అధిగమించి..
వారం రోజుల క్రితమే బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్‌లో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్‌ అదానీ 96.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో అంబానీని అధిగమించగా ఆసియాలో అత్యంత సంపన్నుడయ్యారు. ఇప్పుడు మళ్లీ ముఖేష్‌ అంబానీ 102 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో అదానీని అధిగమించి అపర కుబేడయ్యారు.

100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి.. 
ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్‌ వంటి వారు ఇప్పటికే ఉండగా ముఖేష్‌ అంబానీ క్లబ్‌లో కొత్తగా చేరారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఇలాన్ మస్క్ 200 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నెట్‌వర్త్‌ కలిగిన ఏకైక వ్యక్తి.

Advertisement
 
Advertisement
Advertisement