అంబానీ..  అదానీ ఇంధన బంధం! | Mukesh Ambani, Gautam Adani biggest partnership for fuel retail | Sakshi
Sakshi News home page

అంబానీ..  అదానీ ఇంధన బంధం!

Jun 26 2025 12:52 AM | Updated on Jun 26 2025 8:11 AM

Mukesh Ambani, Gautam Adani biggest partnership for fuel retail

మళ్లీ జట్టుకట్టిన అపర కుబేరులు...

ఇంధనాల విక్రయంలో భాగస్వామ్యం 

జియో–బీపీ పెట్రోల్‌ బంకుల్లో అదానీ సీఎన్‌జీ పంపులు 

అదానీ టోటల్‌ గ్యాస్‌ ఔట్‌లెట్లలో అంబానీ పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ మరో భారీ వ్యాపార వెంచర్‌ కోసం చేతులు కలిపారు. ఒకరి ఇంధన రిటైల్‌ నెట్‌వర్క్‌లో మరొకరి ఇంధనాలను విక్రయించుకునేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం అదానీ టోటల్‌ గ్యాస్‌ (ఏటీజీఎల్‌) సీఎన్‌జీ రిటైల్‌ ఔట్‌లెట్స్‌లో జియో–బీపీ తమ పెట్రోల్, డీజిల్‌ ఇంధనాలను విక్రయిస్తుంది. అలాగే, జియో–బీపీ పెట్రోల్‌ బంకుల్లో ఏటీజీఎల్‌ తమ సీఎన్‌జీ పంపులను ఏర్పాటు చేస్తుంది.

 ప్రస్తుతమున్న, భవిష్యత్‌లో రాబోయే ఔట్‌లెట్స్‌ అన్నింటికీ ఈ ఒప్పందం వర్తిస్తుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. జియో–బీపీ అనేది అంబానీకి చెందిన జియో, బ్రిటన్‌ సంస్థ బీపీ మధ్య జాయింట్‌ వెంచర్‌. ఇక,  ఏటీజీఎల్‌ అనేది అదానీ గ్రూప్, ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ ఎనర్జీస్‌ కలిసి ఏర్పాటు చేసిన జేవీ సంస్థ. 

జియో–బీపీకి దేశవ్యాప్తంగా 1,972 పెట్రోల్‌ బంకులు ఉండగా, ఏటీజీఎల్‌కి 659 సీఎన్‌జీ స్టేషన్లు ఉన్నాయి.  ఇరు సంస్థల పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని జియో–బీపీ చైర్మన్‌ సార్థక్‌ బెహూరియా తెలిపారు.  ఈ డీల్‌ ద్వారా ఔట్‌లెట్స్‌లో అత్యంత నాణ్యమైన, వివిధ రకాల ఇంధనాలను అందించాలనేది తమ ఉమ్మడి లక్ష్యమని ఏటీజీఎల్‌ ఈడీ సురేష్‌ పి. మంగ్లానీ చెప్పారు.  

పీఎస్‌యూలకు పోటీ..: ప్రస్తుతం ఇంధనాల రిటైలింగ్‌ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ఆధిపత్యం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 97,366 పెట్రోల్‌ బంకులు ఉండగా మూడు పీఎస్‌యూలకు (ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌)) ఏకంగా 90% వాటా ఉంది. సిటీ గ్యాస్‌ పంపిణీ వ్యాపారంలో కూడా అవి ముందుంటున్నాయి. 

ఈ నేపథ్యంలో అదానీ, అంబానీ చేతులు కలపడం వల్ల వాటి ఆధిపత్యానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏటీజీఎల్‌ సంస్థ గృహాలు, పరిశ్రమలు, వాహనదారులు, ఇతరత్రా కస్టమర్లకు గ్యాస్‌ను, ఎలక్ట్రిక్‌  వాహనాలకు చార్జింగ్‌ సదుపాయాలు మొదలైనవి అందిస్తోంది. మరోవైపు, జియో–బీపీ ఇంధనాల రిటైలింగ్‌తో పాటు పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాలు, కనీ్వనియెన్స్‌ స్టోర్స్‌ మొదలైన విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  

ఇప్పటికే ఓ పవర్‌ ప్రాజెక్టులో.. 
ఇరువురు కుబేరులు వ్యాపార అవసరాలరీత్యా జట్టు కట్టడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గతేడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లోని ఓ విద్యుత్‌ ప్రాజెక్టు కోసం ఇద్దరూ చేతులు కలిపారు. అదానీ పవర్‌ ప్రాజెక్టులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 26 శాతం వాటా కొనుగోలు చేసింది.

పోటాపోటీ.. గుజరాత్‌కే చెందిన అంబానీ, అదానీ ఇద్దరికీ బడా వ్యాపార సామ్రాజ్యాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే నంబర్‌ వన్‌ సంపన్నులుగా నిలవడంలో గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య పోటీ నడుస్తోంది. అంబానీ ఓవైపు ఆయిల్, గ్యాస్, రిటైల్, టెలికం తదితర రంగాల్లో విస్తరించగా అదానీ మరోవైపు నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బొగ్గు, మైనింగ్‌ తదితర మౌలిక సదుపాయాల రంగాల్లో విస్తరించారు. 

పర్యావరణహిత ఇంధనాల ప్రాజెక్టులను మినహాయిస్తే  ఇద్దరూ ఒకరి రంగంలోకి మరొకరు అడుగుపెట్టలేదు. అదానీ మెగా రెన్యువబుల్‌ ఎనర్జీ పార్క్‌లు, సోలార్‌ మాడ్యూల్స్‌ .. విండ్‌ టర్బైన్ల తయారీపై దృష్టి పెట్టారు. అటు అంబానీకి చెందిన రిలయన్స్‌ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నాలుగు గిగాఫ్యాక్టరీలను  ఏర్పాటు చేస్తోంది. ఇక 2014 నుంచి సీఎన్‌బీసీ–టీవీ18, సీఎన్‌ఎన్‌–న్యూస్‌18, కలర్స్‌లాంటి టీవీ చానళ్ల ద్వారా అంబానీ మీడియా రంగంలో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఎన్‌డీటీవీ కొనుగోలు ద్వారా అదానీ కూడా ఇటీవలే ఈ విభాగంలోకి ప్రవేశించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement