భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచడంలో భాగంగా.. జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా, దేశవ్యాప్తంగా 470కి పైగా ప్రాంతాల్లో 1,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఇవి కేవలం నగరాల్లో మాత్రమే కాకుండా నివాస సముదాయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లు, టెక్ పార్కులు వంటి అనేక సామూహిక ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు.
భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా.. 2026లో కంపెనీ మూడు కొత్త ఎలక్టిక్ వాహనాలను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన మోడళ్లు కూడా ఉండనున్నాయి. ఈ వాహనాలు ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణానికి మరింత అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.
అదే సమయంలో.. కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటివరకు భారత రోడ్లపై మొత్తం 290 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని తెలిపింది. ఈ ప్రయాణాల వల్ల సుమారు 4.17 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గినట్లు కంపెనీ అంచనా వేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఈవీలు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది.


