లాభాలతో షురూ- రియల్టీ, ఫార్మా జోరు

Market open in positive zone- Realty, pharma gains - Sakshi

సెన్సెక్స్‌ 171 పాయింట్లు అప్‌- 44,321కు

38 పాయింట్లు బలపడి 13,007 వద్ద కదులుతున్న నిఫ్టీ

రియల్టీ, ఫార్మా, మెటల్‌ ప్లస్‌లో- ఆటో, మీడియా వీక్‌

బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం అప్‌

ముంబై, సాక్షి: ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన అంచనాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 118 పాయింట్లు పుంజుకుని 44,321కు చేరింది. నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 13,007 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతిని సాధించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,470, నిఫ్టీ 13,064 పాయింట్ల వరకూ ఎగశాయి.

బ్లూచిప్స్‌ తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, మెటల్‌, ఐటీ రంగాలు 2-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. ఆటో, మీడియా 0.25 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో గెయిల్‌, శ్రీసిమెంట్‌, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఆటో, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3-1.3 శాతం మధ్య ఎగశాయి. అయితే నెస్లే, కొటక్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, యాక్సిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎయిర్‌టెల్‌ 2.3-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఏసీసీ అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఏసీసీ, డీఎల్‌ఎఫ్‌, హావెల్స్‌, ఐసీఐసీఐ లంబార్డ్‌, బంధన్‌ బ్యాంక్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 4.6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క చోళమండలం, మణప్పురం, ఎస్కార్ట్స్‌, మైండ్‌ట్రీ, బాటా, అమరరాజా, ఐడియా, కమిన్స్‌, క్యాడిలా హెల్త్‌ 2.3-1.4 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.4-0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,355 లాభపడగా.. 641 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 7,713 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 4,969 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 2,027 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 3,400 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టినన విషయం విదితమే. కాగా.. నవంబర్‌ నెలలో ఎఫ్‌పీఐలు ఈక్విటీలలో రూ. 60,358 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం విశేషం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top