భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్‌లైన్స్‌ | Malaysia Airlines expand operations in India increase frequencies to Trivandrum and Ahmedabad | Sakshi
Sakshi News home page

భారత్‌లో సర్వీసులు పెంచనున్న ఎయిర్‌లైన్స్‌

Sep 16 2024 1:50 PM | Updated on Sep 16 2024 2:58 PM

Malaysia Airlines expand operations in India increase frequencies to Trivandrum and Ahmedabad

మలేషియా ఎయిర్‌లైన్స్ కీలక మార్కెట్‌గా భావించే భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించాలని యోచిస్తోంది. దేశంలో ప్రస్తుతం తొమ్మిది నగరాలకు ఈ ఎయిర్‌లైన్ సర్వీసులు నడుపుతోంది. సమీప భవిష్యత్తులో వీటి ఫ్రీక్వెన్సీ(సర్వీసుల సంఖ్య)ను పెంచబోతున్నట్లు మలేషియా ఎయిర్‌లైన్స్‌ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఇజం ఇస్మాయిల్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థకు భారత మార్కెట్‌ చాలా కీలకం. ప్రస్తుతం దేశంలో తిరువనంతపురం, అహ్మదాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అమృత్‌సర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి తొమ్మిది నగరాలకు సర్వీసులు నడుపుతున్నాం. అందులో తిరువనంతపురం, అహ్మదాబాద్‌లకు సర్వీసు ఫ్రీక్వెన్సీలను పెంచాలని నిర్ణయించాం. కొత్తగా పెంచే ఫ్రీక్వెన్సీతో ఆ నగరాలకు వారానికి నాలుగు సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం మలేషియా ఎయిర్‌లైన్స్ దేశంలో వారానికి 71 విమానాలను నడుపుతోంది. ఆగస్టులో అమృత్‌సర్‌కు ఫ్రీక్వెన్సీ పెంచాం. 2025లో దేశంలో ఇతర నగరాలకు సర్వీసులు నడపాలనే అంశంపై చర్చలు సాగుతున్నాయి’ అని చెప్పారు.

ఇదీ చదవండి: నాలుగేళ్లుగా ఉన్న ఆంక్షలు ఎత్తివేత!

విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌ 2016లో ఉడాన్‌(ఉడే దేశ్‌కా అమ్‌ నాగరిక్‌) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దేశీయ విమాన కంపెనీలకు ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. టైర్‌ 2, 3 నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేలా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తోంది. దాంతో విదేశీ కంపెనీలు కూడా భారత్‌తో తమ సేవలు విస్తరించాలని యోచిస్తున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement