ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్లు(ఓటీఏ) వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న భారీ రద్దు చార్జీల (క్యాన్సిలేషన్ ఛార్జీలు) వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. విమానయాన సంస్థలు నిర్ణయించిన రుసుముల కంటే అదనంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న టిక్కెట్ రద్దు ఛార్జీలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖతో పాటు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తక్షణమే రంగంలోకి దిగి అన్ని ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ల విధానాలపై దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు.
పారదర్శకతకు పాతర.. చట్టప్రకారం చర్యలు!
ఈ అంశంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఆన్లైన్ బుకింగ్ సంస్థల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘విమానయాన సంస్థలు అధికారికంగా వసూలు చేసే ఛార్జీల కంటే ఎక్కువగా లేదా బుకింగ్ సమయంలో వినియోగదారులకు స్పష్టంగా వెల్లడించకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఇష్టారాజ్యంగా అదనపు రద్దు ఛార్జీలు వసూలు చేస్తున్నాయనే అంశంపై విచారణకు ఆదేశించాం. ఇటువంటి చర్యలు మార్కెట్లో పారదర్శకతను దెబ్బతీయడమే కాకుండా వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి’ అని ప్రహ్లాద్ జోషి అన్నారు.
ఒకవేళ విచారణలో ఈ ప్లాట్ఫామ్లు వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినట్లు లేదా అక్రమ వ్యాపార పద్ధతులకు పాల్పడినట్లు తేలితే.. ‘వినియోగదారుల రక్షణ చట్టం-2019’ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అవసరమైతే బాధితుల తరఫున సీసీపీఏ ద్వారా ‘క్లాస్ యాక్షన్’ (ఉమ్మడి చట్టపరమైన చర్యలు) తీసుకునేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి తేజీందర్ బగ్గా చేసిన సోషల్ మీడియా పోస్ట్తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేరుగా ఎయిర్లైన్ సంస్థ ద్వారా బుక్ చేసుకునే టికెట్ రద్దు ఛార్జీలకు, థర్డ్-పార్టీ ఆన్లైన్ ట్రావెల్ యాప్ల ద్వారా బుక్ చేసుకునే ఛార్జీలకు మధ్య వ్యత్యాసం ఉంటోందని ఆయన ఆధారాలతో సహా పోస్ట్ చేశారు.
విచారణ పరిధిలోకి అన్ని ప్లాట్ఫామ్లు
కేవలం ఒక్క సంస్థపైనే కాకుండా దేశంలో సేవలందిస్తున్న అన్ని ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ల (ఉదాహరణకు మేక్మైట్రిప్, ఈజ్మైట్రిప్, క్లియర్ట్రిప్, యాత్ర, అగోడా మొదలైనవి) రద్దు విధానాలు, వారు విధిస్తున్న హిడెన్ ఛార్జీలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగనుందని మంత్రి జోషి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి


