లలితా జ్యువెల్లరి ఐపీవోకి సెబీ ఓకే  | Lalithaa Jewellery gets Sebi nod to raise Rs 1,700 crore via IPO | Sakshi
Sakshi News home page

లలితా జ్యువెల్లరి ఐపీవోకి సెబీ ఓకే 

Oct 7 2025 6:14 AM | Updated on Oct 8 2025 12:13 PM

Lalithaa Jewellery gets Sebi nod to raise Rs 1,700 crore via IPO

రూ. 1,700 కోట్ల సమీకరణ 

హైదరాబాద్‌: లలితా జ్యువెల్లరి మార్ట్‌ ప్రతిపాదిత ఇనీషీయల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,700 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్‌ కిరణ్‌ కుమార్‌ జైన్‌ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనున్నారు. 

తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,014.50 కోట్లను కొత్త స్టోర్స్‌ ఏర్పాటుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 1985లో చెన్నై టీ నగర్‌లో తొలి స్టోర్‌ ప్రారంభించిన లలితా జ్యువెల్లరి దక్షిణాదిలో 56 స్టోర్లతో  విస్తరించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 22, తెలంగాణలో 6 స్టోర్స్‌ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,316.80 కోట్లుగా ఉన్న ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,788 కోట్లకు చేరగా లాభం రూ. 238.3 కోట్ల నుంచి రూ. 359.8 కోట్లకు చేరింది.

లలితా జ్యువెలరీ మార్ట్ (Lalithaa Jewellery Mart) దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రాంతీయ బ్రాండ్‌ల్లో ఒకటి. కొన్నేళ్లుగా కంపెనీ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. నాణ్యత, పారదర్శకత, భారీ స్టోర్ల ఏర్పాటు వ్యూహంతో ఈ సంస్థ దేశీయ నగల మార్కెట్‌లో తనదైన ముద్ర వేస్తోంది. నాణ్యతకు నిదర్శనంగా అన్ని ఆభరణాలపై BIS హాల్‌మార్క్ ప్రమాణాలను పాటిస్తూ బంగారం (Gold), వెండి (Silver), వజ్రాల (Diamond) ఆభరణాలను అందిస్తోంది. ఈ సంస్థకు మొత్తం 6.09 లక్షల చదరపు అడుగుల వ్యాపార స్థలం ఉంది. ఇది సంస్థ విస్తృతికి అద్దం పడుతోంది.

ఆర్థిక ప్రగతిలో దూకుడు

లలితా జ్యువెలరీ గత కొంతకాలంగా ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోంది. సంస్థ ఆదాయ వృద్ధి రేటు 43.62%గా ఉందని కంపెనీ తెలిపింది. ఇది ఈ రంగంలో సంస్థ బలమైన పనితీరును సూచిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.16,788 కోట్లు ఆదాయం వస్తే రూ.359.8 కోట్లు లాభం వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరంలో (9 నెలలు) రూ.12,594 కోట్లు ఆదాయం వస్తే అందులో రూ.262.3 కోట్లు లాభంగా ఉందని కంపెనీ తెలిపింది.

భారీ స్టోర్ల వ్యూహం, తయారీ సామర్థ్యం

లలితా జ్యువెలరీ దేశంలోనే అతిపెద్ద నగల స్టోర్లను నెలకొల్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన స్టోర్ల పరిమాణం ప్రత్యేకంగా నిలిచింది. విజయవాడలో 1,00,000 చదరపు అడుగులు, సోమాజిగూడ (హైదరాబాద్)లో 98,210 చదరపు అడుగులు, విశాఖపట్నంలో 65,000 చదరపు అడుగులతో స్టోర్లు నెలకొల్పింది.

ఈ సంస్థకు తమిళనాడులో రెండు అత్యాధునిక తయారీ కేంద్రాలు (మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు) ఉన్నాయి. ఇక్కడ 563 మంది నిపుణులైన కారిగర్లు(బంగారు ఆభరణాల తయారీదారులు) పనిచేస్తున్నారు. వీరు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా అనేక రకాల డిజైన్లను రూపొందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement