పబ్లిక్‌ ఇష్యూకు మూడు కంపెనీలు | Three Companies Line Up IPOs to Raise Over Rs 3000 Crore | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ ఇష్యూకు మూడు కంపెనీలు

Feb 18 2026 5:40 PM | Updated on Feb 18 2026 5:49 PM

Three Companies Line Up IPOs to Raise Over Rs 3000 Crore

న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ క్లీన్‌ మ్యాక్స్‌ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 1,000–1,053 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో రూ. 1,900 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్‌ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 3,100 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 20న షేర్లను ఆఫర్‌ చేయనుంది. తొలుత 2025 ఆగస్ట్‌ దరఖాస్తులో రూ. 5,200 కోట్ల సమీకరణకు సిద్ధపడినప్పటికీ పరిమాణాన్ని కుదించింది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 1,125 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. మార్చి 2న లిస్ట్‌కానున్న కంపెనీ రూ. 12,325 కోట్ల మార్కెట్‌ విలువను అందుకునే వీలుంది.

కంపెనీ తీరిలా 
2010లో ఏర్పాటైన రెనెవబుల్‌ ఎనర్జీ కంపెనీ క్లీన్‌ మ్యాక్స్‌ ప్రధానంగా వాణిజ్య(కమర్షియల్‌), పారిశ్రామిక(ఇండ్రస్టియల్‌) రంగాలకు పవన, సౌర, హైబ్రిడ్‌(పునరుత్పాదక) విద్యుత్‌ సరఫరాసహా ఇంధన సరీ్వసులను అందిస్తోంది. ఆయా రంగాలకు నెట్‌ జీరో, కర్బననిర్మూలన సొల్యూషన్స్‌ సమకూర్చుతోంది. 2025 జూలై 31కల్లా కంపెనీ 2.54 గిగావాట్ల నిర్వహణా సామర్థ్యంతోపాటు.. మరో 2.53 జీడబ్ల్యూ కాంట్రాక్ట్‌డ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా 5.07 జీడబ్ల్యూ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. 2024–25లో ఆదాయం 13 శాతం ఎగసి రూ. 1,610 కోట్లను అధిగమించింది. నష్టాల నుంచి బయటపడి రూ. 28 కోట్ల నికర లాభం ఆర్జించింది. డేటా సెంటర్లు, ఏఐ, టెక్నాలజీ, సిమెంట్, స్టీల్‌ తది తర రంగాల క్లయింట్లకు సరీ్వసులు అందిస్తోంది.

గౌడియం ఐవీఎఫ్‌ ఐపీవో 20న 
ఫెర్టిలిటీ సర్వీసుల సంస్థ గౌడియం ఐవీఎఫ్‌ అండ్‌ విమెన్‌ హెల్త్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 75–79 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 20న ప్రారంభమై 24న ముగియనుంది. దీనిలో భాగంగా 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 95 లక్షల షేర్లను ప్రమోటర్‌ మనికా ఖన్నా విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా సంస్థ రూ. 165 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 18న షేర్లను ఆఫర్‌ చేయనుంది. వెరసి కృత్రిమ గర్భధారణ(ఫెర్టిలిటీ) సరీ్వసులందించే సంస్థ తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లను దేశవ్యాప్తంగా 19 కొత్త ఐవీఎఫ్‌ కేంద్రాల ఏర్పాటుకు వెచ్చించనుంది. రూ. 20 కోట్లు రుణచెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. ఈ నెల 27న లిస్ట్‌కానున్న సంస్థ రూ. 575 కోట్ల మార్కెట్‌ విలువను అందుకునే వీలుంది.

కంపెనీ తీరిలా 
ఖన్నా ఏర్పాటు చేసిన గౌడియం ఐవీఎఫ్‌ దేశీయంగా రీప్రొడక్టివ్‌ టెక్నాలజీలలో సుప్రసిద్ధమైంది. 7 ప్రధాన కేంద్రాలుసహా 28 అనుబంధ విభాగాల ద్వారా సంస్థ సేవలు సమకూర్చుతోంది. 2024–25లో ఆదాయం రూ. 48 కోట్ల నుంచి రూ. 71 కోట్లకు ఎగసింది. నికర లాభం రూ. 10 కోట్ల నుంచి రూ. 19 కోట్లకు జంప్‌చేసింది. కంపెనీ తొలుత(జనవరిలో) 1.83 కోట్ల ఈక్విటీ షేర్ల జారీసహా.. ప్రమోటర్‌ 25.31 లక్షల షేర్లు ఆఫర్‌ చేయనున్నట్లు పేర్కొంది. తదుపరి వీటి సంఖ్యను సవరించింది. ఐపీవో చేపట్టేందుకు 2025 జూలైలో గోప్యతా మార్గంలో సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది.

కార్ల్స్‌బెర్గ్‌ ఐపీవో చూపు 
మాల్ట్‌ పానీయాల డెన్మార్క్‌ దిగ్గజం కార్ల్స్‌బెర్గ్‌ దేశీ బిజినెస్‌ను స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ చేయాలని యోచిస్తోంది. తద్వారా వాటాదారులకు విలువ చేకూర్చాలని చూస్తున్నట్లు గ్రూప్‌ సీఈవో జాకబ్‌ ఆరుప్‌ ఆండర్సన్‌ వెల్లడించారు. అయితే పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేశారు. దేశీయంగా పటిష్ట వృద్ధిని సాధిస్తున్న కంపెనీ దేశీ బిజినెస్‌ను లిస్ట్‌ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. సంస్థ వాటాదారుల విలువ పెంచేందుకు ఐపీవోసహా ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఇంతకుమించి మాట్లాడేందుకు చట్ట సంబంధిత అంశాలు అడ్డుపడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో లిస్టింగ్‌ అంశంపై స్పందించలేనని, అయితే వాటాదారులకు విలువ చేకూర్చడంపై ఆసక్తిగా ఉన్నట్లు వివరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement