క్యూ1లో అంచనాలను మించిన వృద్ధి రేటు; 7.8 శాతంగా నమోదు
పెద్ద ఎకానమీల్లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి
ఇరాన్ యుద్ధం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితిలోనూ జోరు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ తగ్గేదేలే అంటూ భారీగా పుంజుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2026–27 ఏప్రిల్–జూన్, క్యూ1)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను మించి 7.8 శాతంగా నమోదైంది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో జీడీపీ 6.9 శాతం వృద్ధి చెందింది. అయితే, గతేడాది చివరి క్వార్టర్ (2025–26, క్యూ4)లో వృద్ధి రేటు 8.6 శాతంతో పోలిస్తే మాత్రం నిదానించింది. కేంద్ర గణాంకాల శాఖ సోమవారం ఈ డేటాను విడుదల చేసింది. ఇరాన్–అమెరికా వార్తో అధిక క్రూడ్ ధరలు.. ఇంధన, కమోడిటీ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, బలహీన ప్రపంచ డిమాండ్ నేపథ్యంలో కూడా మన జీడీపీ మెరుగ్గానే వృద్ధి చెందడం గమనార్హం.
అంతేకాదు పెద్ద ఎకానమీల్లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు సాధిస్తున్న దేశంగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) క్యూ1లో 7 శాతం వృద్ధిని అంచనా వేయగా, దీనికి మించి ఎకానమీ పరుగులు తీసింది. భౌగోళిక రాజకీయ రిస్కులు తీవ్రతరమైనా, పటిష్టమైన దేశీ ఆర్థిక కార్యకలాపాలు దన్నుగా నిలిచాయని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కాగా, ప్రస్తుత 2026–27 పూర్తి ఏడాదికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది.
రూ. 81.36 లక్షల కోట్లు...
స్థిర ధరల ప్రకారం 2026–27 క్యూ1లో వాస్తవ (రియల్) జీడీపీ విలువ రూ.81.36 లక్షల కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.75.46 లక్షల కోట్లుగా ఉంది. అంటే, 7.8 శాతం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం సాధారణ (నామినల్) స్థూల దేశీయోత్పత్తి 10.3% వృద్ధితో రూ.80 లక్షల కోట్ల నుంచి రూ.88.27 లక్షల కోట్లకు ఎగబాకింది. వాస్తవ స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి 8.2%గా నమోదైంది.
అత్యంత అనిశ్చిత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో సైతం గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్మాణాత్మక సంస్కరణల ఫలితంగానే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ బలంగా నిలదొక్కుకోగలుగుతోందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాల పరంగా రానున్న కాలంలో కొన్ని సమస్యలు ఉండొచ్చని, అయితే, ప్రస్తుతం బలమైన దేశీ వినియోగం, ఎగుమతుల పనితీరుతో మరో త్రైమాసికంలో పటిష్టమైన వృద్ధి సాధ్యపడిందన్నారు.
రంగాల వారీగా క్యూ1 పనితీరు..
→ తయారీ రంగం 9.2 శాతం పటిష్టమైన వృద్ధిని సాధించింది. గతేడాది క్యూ1లో ఇది 8.3 శాతంగా ఉంది.
→ వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి 4.4 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గింది.
→ ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసుల్లో వృద్ధి 8.8 శాతం నుంచి 12.1 శాతానికి పెరిగింది.
→ నిర్మాణ రంగం 5.2 శాతం నుంచి 7.7 శాతానికి వృద్ధి చెందింది.
→ వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్స్ వృద్ధి 9.8 శాతం నుంచి 8.5 శాతానికి నిదానించింది.
→ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సర్వీసుల రంగంలో వృద్ధి 4.6% నుంచి 7.5%కి ఎగసింది.
→ మైనింగ్ రంగం 12.4 శాతం వృద్ధి నుంచి మైనస్ 2.4 క్షీణతలోకి జారుకుంది.
→ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సరీ్వసుల్లో మైనస్ 1.8 శాతం క్షీణత నుంచి 8.9 శాతం వృద్ధిలోకి దూసుకెళ్లింది.
అసాధారణ ఘనత: ప్రధాని మోదీభారత్ క్యూ1లో సాధించిన అద్భుతమైన జీడీపీ వృద్ధి రేటును ప్రధాని నరేంద్ర మోదీ ’అసాధారణ ఘనత’గా అభివరి్ణంచారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ’ఎక్స్’లో చేసిన పోస్ట్లో ‘చమురు ధరల షాక్లు, సరఫరా వ్యవస్థ సమస్యలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ పటిష్టమైన వృద్ధిని సాధించగలిగిందంటే, దేశ ప్రజల సమష్టి బలానికి ఇది నిదర్శనం. ఆర్థిక వ్యవస్థ పనైపోయిందంటూ విమర్శించిన వారికి చుక్కెదురైంది. భారత్ మరోసారి వికసించింది’ అని మోదీ వ్యాఖ్యానించారు.
సంస్కరణల ఫలితమిది: సీతారామన్
ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు తోడు ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం వల్లే జీడీపీ వృద్ధి రేటు తొలి త్రైమాసికంలో 7.8 శాతానికి పుంజుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘ఈ పటిష్టమైన ఆర్థిక పనితీరుకు ముమ్మాటికీ దేశ ప్రజలు, వారి కృషే కారణం. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు తీసుకొచి్చన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను చురుగ్గా నిర్వహించడం కూడా దీనికి తోడ్పడింది’ అని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.


