ఏఐ రంగంలో భారత్‌ దూకుడు ఖాయం | India Bold AI Leap, Challenging Big Tech Monopoly With BharatGen, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఏఐ రంగంలో భారత్‌ దూకుడు ఖాయం

Jul 2 2026 12:12 PM | Updated on Jul 2 2026 2:06 PM

India Bold AI Leap Challenging Big Tech Monopoly Building Bharat Gen

ప్రపంచ సాంకేతిక రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. అయితే, ఈ రంగం కేవలం కొన్ని పాశ్చాత్య టెక్ దిగ్గజాల గుత్తాధిపత్యంలోనే ఉండిపోతుందా? లేక భారత్ వంటి దేశాలు స్వయంసమృద్ధి సాధించగలవా? అనే చర్చకు జోహో అధినేత శ్రీధర్ వెంబు సరికొత్త దిశను చూపించారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై నిరంతరం చర్చించే వెంబు.. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఏఐ కంపెనీల పోటీని ప్రశంసించడంతో పాటు భారత్‌లో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని చెప్పారు.

మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంపై..

టెక్ మార్కెట్లో అమెరికన్ కంపెనీల గుత్తాధిపత్య ధోరణిని ఎండగట్టడానికి శ్రీధర్ వెంబు ఇటీవల ఒక ఆసక్తికరమైన ఉదాహరణను పంచుకున్నారు. ఒక భారతీయ కస్టమర్ తన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో ఎదురైన అనుభవాన్ని ఆయన ఉదహరించారు.

‘సదరు కస్టమర్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నుంచి స్వదేశీ సాఫ్ట్‌వేర్ అయిన జోహో ఆఫీస్ సూట్‌కు మారిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పగానే.. మైక్రోసాఫ్ట్ ఒక్కసారిగా దిగొచ్చింది. తన కస్టమర్‌ను కోల్పోకూడదనే భయంతో ఏకంగా 90% తగ్గింపును ఆఫర్ చేసింది’ అన్నారు. పోటీ లేకపోతే ఈ దిగ్గజాలు కస్టమర్లను ఎలా దోపిడీ చేస్తాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని వెంబు పేర్కొన్నారు. మార్కెట్‌లో ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడే వినియోగదారుడికి నిజమైన లబ్ధి చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు.

‘యాంటీట్రస్ట్’ కేసు గుర్తుచేసిన జోహో బాస్

మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులను విమర్శిస్తూ.. గతంలో ఆ సంస్థ ఎదుర్కొన్న చట్టపరమైన సవాళ్లను వెంబు గుర్తుచేశారు.

యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ మైక్రోసాఫ్ట్ కార్ప్ (1998): మైక్రోసాఫ్ట్ చట్టవిరుద్ధంగా తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌తో పాటు 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టుకెక్కారు.

పోటీని అణచివేసే కుట్ర: విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’ బ్రౌజర్‌ను ఉచితంగా ఇన్-బిల్ట్‌గా ఇవ్వడం ద్వారా.. అప్పట్లో పాపులర్ అయిన ‘నెట్‌స్కేప్ నావిగేటర్’ వంటి ప్రత్యర్థి బ్రౌజర్ల మనుగడను మైక్రోసాఫ్ట్ దెబ్బతీసిందని ఆరోపణలు వచ్చాయి.

కంపెనీ విభజన తీర్పు: ఏప్రిల్ 2000లో యూఎస్ డిస్ట్రిక్ట్‌ న్యాయమూర్తి థామస్ పెన్‌ఫీల్డ్ జాక్సన్.. మైక్రోసాఫ్ట్ యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందని తీర్పునిస్తూ కంపెనీని రెండుగా విభజించాలని (ఒకటి విండోస్ ఓఎస్ కోసం, మరొకటి సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల కోసం) ఆదేశించారు. అయితే, ఆ తర్వాత అప్పీల్‌లో ఈ ఉత్తర్వు రద్దయినప్పటికీ మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్య ధోరణి ప్రపంచానికి స్పష్టమైంది.

చైనా ఏఐ పోటీ.. ప్రపంచానికి మేలు!

ప్రస్తుతం ఏఐ రంగంలో అమెరికా ఆధిపత్యానికి చైనా గట్టి పోటీ ఇస్తోంది. చైనా ఏఐ కంపెనీల వేగవంతమైన వృద్ధిని శ్రీధర్ వెంబు సానుకూల దృక్పథంతో స్వాగతించారు. ఈ అంతర్జాతీయ పోటీ వల్ల ఏఐ మోడళ్ల శిక్షణ ఖర్చులు విపరీతంగా తగ్గుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ ధరల తగ్గుదల గ్లోబల్ ఏఐ పర్యావరణ వ్యవస్థను సమతుల్యం చేయడానికి, ఓపెన్ మార్కెట్‌ను ప్రోత్సహించడానికి కీలకమని చెప్పారు.

‘భారత్ జెన్’ ప్రాజెక్ట్: స్వదేశీ ఏఐ కల సాకారం

ఏఐ శిక్షణ ఖర్చులు తగ్గడం వల్ల భారతదేశానికి భారీ అవకాశాలు లభిస్తాయని వెంబు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారతదేశంలో సొంత ఏఐ మోడళ్లు పుట్టుకొస్తాయని నేను ఇప్పుడు బలంగా విశ్వసిస్తున్నాను. మనం నిరాశ చెందకూడదు’ అని పిలుపునిచ్చారు. భారత్‌లో విద్యాసంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో బహుళ ఏఐ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనికి ప్రధాన ఉదాహరణగా ఐఐటీ బొంబాయి నేతృత్వంలో సాగుతున్న ‘భారత్ జెన్’ ప్రాజెక్ట్ సాధిస్తున్న పురోగతిని వెంబు సాక్ష్యంగా చూపారు. పాశ్చాత్య దేశాల ఏఐ సాంకేతికతకు, భారతీయ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ స్వదేశీ ప్రాజెక్టులు వేగంగా భర్తీ చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement