
2025 మార్చిలో ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమలో అత్యధికంగా అమ్ముడైన కారుగా 'హ్యుందాయ్ క్రెటా' (Hyundai Creta) రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది 18,059 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రకటించింది.
హ్యుందాయ్ క్రెటా 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 1,94,871 యూనిట్ల అమ్మకాలతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడవ కారుగా నిలిచింది. మొత్తం అమ్మకాల పరంగా ఇది 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రెటా ప్రారంభమైనప్పటినుంచి.. ఇప్పటి వరకు అత్యధిక అమ్మకాలు ఇదే కావడం గమనార్హం.
హ్యుందాయ్ కంపెనీ క్రెటా కారును మార్కెట్లో లాంచ్ (2015) చేసి పదేళ్లు పూర్తయ్యాయి. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న క్రెటా కారు.. మొత్తం మూడు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. అవి 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు.
ఇదీ చదవండి: 'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్గేట్స్ ఎదుటే ఉద్యోగుల నిరసన (వీడియో)
మొత్తం 10 వేరియంట్లలో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ క్రెటా కారు ధరలు రూ. 11.10 లక్షల నుంచి రూ. 20.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. కాగా ఇది ఈ మధ్య కాలంలోనే ఎలక్ట్రిక్ రూపంలో కూడా మార్కెట్లో అడుగుపెట్టింది. ఇది 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).