హైదరాబాద్‌లో ఇళ్ల ధరల పెరుగుదల | house prices in Hyderabad have been increasing | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇళ్ల ధరల పెరుగుదల

Dec 3 2024 8:42 AM | Updated on Dec 3 2024 8:42 AM

house prices in Hyderabad have been increasing

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగారల్లో ఇళ్ల ధరలు జులై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో 11 శాతం మేర పెరిగాయి. ఇందులో అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 32 శాతం మేర ధరలు ఎగిసిపడగా, హైదరాబాద్‌లో 3 శాతం పెరిగాయి. ఈ వివరాలను రియల్టర్ల మండలి క్రెడాయ్, కొలియర్స్, లైసెస్‌ ఫొరాస్‌ సంస్థల సంయుక్త నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రియల్టీ మార్కెట్లో బలమైన డిమాండ్‌ నమోదైంది. ఇళ్ల సగటు ధరలు వరుసగా 15వ త్రైమాసికంలోనూ వృద్ధి బాటలో నడిచాయి. ఎనిమిది నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 11 శాతం వృద్ధితో చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) ధర రూ.11,000కు చేరినట్టు ఈ నివేదిక 
వెల్లడించింది.  

పట్టణాల వారీగా..

  • జులై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో అత్యధికంగా 32 శాతం మేర ఇళ్ల ధరల్లో వృద్ధి కనిపించింది. ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.11,438కి చేరింది.

  • ఢిల్లీ తర్వాత అత్యధికంగా బెంగళూరులో ఇళ్ల ధరలు సగటున 24 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.11,743గా నమోదైంది.  

  • హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు సగటున 3 శాతం పెరిగాయి. ఎస్‌ఎఫ్‌టీ రూ.11,351కి చేరింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.11,040గా ఉంది.  

  • పుణెలో ఎస్‌ఎఫ్‌టీ ధర 10 శాతం పెరిగి రూ.9,890కు చేరింది.

  • ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో 4 శాతం పెరిగి ఎస్‌ఎఫ్‌టీ రూ.20,438గా ఉంది.  

  • కోల్‌కతాలోనూ 3 శాతం పెరుగుదల నమోదైంది. చదరపు అడుగు ధర రూ.11,351కి చేరింది.  

  • చెన్నై మార్కెట్లో చదరపు అడుగు ధర రూ.7,889గా నమోదైంది. మెట్రోల్లో అతి తక్కువ పెరుగుదల ఇక్కడే.  

  • అహ్మదాబాద్‌లో 16 శాతం వృద్ధితో ఎస్‌ఎఫ్‌టీ రూ.7,640కు చేరింది.

సానుకూల సెంటిమెంట్‌..

ఇళ్ల ధరల పెరుగుదల గృహ కొనుగోలుదారుల్లో నెలకొన్న సానుకూల సెంటిమెంట్, సానుకూల వాతావరణానికి నిదర్శనమని క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ బొమన్‌ ఇరానీ పేర్కొన్నారు. విక్రయాలు, ధరల పెరుగుదల కొనసాగడం అందుబాటు ధరలు, డిమాండ్‌ను తెలియజేస్తున్నట్ట లైసస్‌ ఫొరాస్‌ ఎండీ పంకజ్‌ కపూర్‌ వ్యాఖ్యానించారు. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ లగ్జరీ ఇళ్ల విభాగం ఆధిపత్యం కొనసాగుతోందని చెప్పారు. ఎంఎంఆర్, పుణె, హైదరాబాద్‌ మార్కెట్లు విక్రయాలు, సరఫరాల్లో మార్పులేని స్థితికి చేరాయని.. ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, టైర్‌–2 పట్టణాల్లో సరఫరా తగ్గిందని తెలిపారు. ధరలు పెరుగుతున్నప్పటికీ.. ద్రవ్య విధానాన్ని ఆర్‌బీఐ సరళీకరించడం, రెపో రేటు తగ్గింపు అంచనాలతో గృహ కొనుగోలుదారులకు సమీప కాలంలో ఉపశమనం లభిస్తుందని కొలియర్స్‌ ఇండియా సీఈవో బాదల్‌ యాగ్నిక్‌ అభిప్రాయపడ్డారు.

పెట్టుబడుల తీరు..

రియల్టీ తర్వాత ఐటీ/ఐటీఈఎస్‌ రంగంలోకి అత్యధికంగా రూ.27,815 కోట్లు ఏఐఎఫ్‌ల ద్వారా వచ్చాయి. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో రూ.25,782 కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీల్లోకి రూ.21,503 కోట్లు, బ్యాంకుల్లోకి రూ.18,242 కోట్లు, ఫార్మాలోకి రూ.17,272 కోట్లు, ఎఫ్‌ఎంసీజీలోకి రూ.11,680 కోట్లు, రిటైల్‌లోకి రూ.11,379 కోట్లు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలోకి రూ.10,672 కోట్లు, ఇతర రంగాల్లోకి రూ.2,29,571 కోట్లు వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది. దశాబ్ద గరిష్టానికి ఏఐఎఫ్‌ పెట్టుబడులు చేరాయని, మొత్తం ఏఐఎఫ్‌ ఫండ్స్‌ సంఖ్యలోనూ వృద్ధి నెలకొన్నట్టు తెలిపింది. ‘ఏఐఎఫ్‌ పెట్టుబడుల్లో కేటగిరీ 2 ఏఐఎఫ్‌ల పాత్ర కీలకంగా ఉంది. రియల్‌ ఎస్టేట్‌ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్, డెట్‌ ఫండ్స్, ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌) ఇందులో భాగంగా ఉన్నాయి’ అని పురి తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో మొత్తం ఏఐఎఫ్‌ పెట్టుబడుల్లో కేటగిరీ–2 నుంచే 80 శాతం మేర ఉన్నట్టు అనరాక్‌ నివేదిక తెలిపంది. రియల్‌ ఎస్టేట్‌లో ఏఐఎఫ్‌ పెట్టుబడులు అధికంగా ఉండడం వెనుక ఈ రంగంలో భద్రత, రక్షణ ఎక్కువగా ఉండడమే కారణమని గోల్డెన్‌ గ్రోత్‌ ఫండ్‌ సీఈవో అంకుర్‌ జైన్‌ తెలిపారు.

రియల్టీలోకి భారీగా ఏఐఎఫ్‌ పెట్టుబడులు

రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు (ఏఐఎఫ్‌) పెద్ద ఎత్తున వస్తున్నాయి. దేశ రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలో ఏఐఎఫ్‌ పెట్టుబడులు రూ.75,000 కోట్లకు చేరినట్టు రియల్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ తెలిపింది. ఏఐఎఫ్‌ మొత్తం పెట్టుబడుల్లో 17 శాతం రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకే వచ్చినట్లు వెల్లడించింది. గడిచిన 10 ఏళ్లలో భారత్‌లో ఏఐఎఫ్‌లలో భారీ వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. మిగిలిన రంగాలతో పోల్చి చూసినప్పుడు ఏఐఎఫ్‌ పెట్టుబడులకు రియల్టీ ఆకర్షణీయ ఎంపికగా ఉన్నట్టు వివరించింది.

ఇదీ చదవండి: చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ ఎత్తివేత

రియల్‌ఎస్టేట్‌లో రూ.75,468 కోట్లు

‘సెబీ తాజా డేటా ప్రకారం.. 2024–25 సెప్టెంబర్‌ త్రైమాసికం (క్యూ2) వరకు రూ.4,49,384 కోట్ల ఏఐఎఫ్‌ పెట్టుబడుల్లో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చినవి రూ.75,468 కోట్లు (17 శాతం)గా ఉన్నాయి’ అని అనరాక్‌ నివేదిక వెల్లడించింది. రియల్‌ ఎస్టేట్‌ తర్వాత ఐటీ/ఐటీఈఎస్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంక్‌లు, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, రెన్యువబుల్‌ ఎనర్జీ, ఇతర రంగాలు ఏఐఎఫ్‌లతో ప్రయోజనం పొందినట్టు తెలిపింది. ‘ఏఐఎఫ్‌ ద్వారా రియల్‌ ఎస్టేట్‌లోకి వచ్చిన పెట్టుబడులు 2024 మార్చి నాటికి రూ.68,540 కోట్లుగా ఉంటే, 2024–25 సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి రూ.75,468 కోట్లకు పెరిగాయి. కేవలం ఆరు నెలల్లోనే 10 శాతం మేర పెట్టుబడుల్లో వృద్ధి కనిపించింది’ అని అనరాక్‌ ఛైర్మన్‌ అనుజ్‌పురి వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement