వియత్నాంకు చెందిన మొబిలిటీ సర్వీస్ ప్రొవైడర్.. గ్రీన్ ఎస్ఎమ్, భారతదేశంలో గ్రీన్ ఎస్ఎమ్ లిమో టాక్సీ సర్వీస్ను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ కేవలం ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది. తరువాత దశలవారీగా దేశం మొత్తం విస్తరించనుంది.
గ్రీన్ ఎస్ఎమ్ కంపెనీ తన సేవలను వియత్నాం దేశంలో మాత్రమే కాకుండా.. లావోస్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలలో కూడా విస్తరించింది. ఇప్పుడు భారతదేశంలో అడుగుపెట్టింది. సురక్షితమైన, నమ్మకమైన, అధిక నాణ్యత గల మొబిలిటీ ఎంపికను అందించడంతో పాటు.. డ్రైవర్లకు స్థానిక ఉపాధి అవకాశాలను కూడా కల్పించడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది.
గ్రీన్ ఎస్ఎమ్ లిమో అనేది.. ప్రయాణీకుల రవాణా కోసం అభివృద్ధి చేసిన ఏడు సీట్ల ఎలక్ట్రిక్ కారు. ఈ కార్లలో ప్రయాణికుల కోసం త్రాగునీరు, వెట్ టిష్యూలు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల భద్రత కోసం సంస్థ.. తమ వాహనాలలో 'సెక్యూర్-టు-సేఫ్' భద్రతా వ్యవస్థను అమర్చినట్లు వెల్లడించింది.
గ్రీన్ ఎస్ఎమ్ లిమోలో కెమెరాలు, ఏఐ బేస్డ్ ఫీచర్స్ మాత్రమే కాకుండా.. డ్రైవర్లు, ప్రయాణీకులిద్దరి కోసం ఎమర్జెన్సీ సపోర్ట్ బటన్స్ ఉంటాయి. కాగా.. కంపెనీ తమ డ్రైవర్లకు ఎలక్ట్రిక్ వాహన నిర్వహణ, రహదారి భద్రత, కస్టమర్ సర్వీస్లో శిక్షణ ఇస్తామని కూడా పేర్కొంది. భారతదేశంలోని వినియోగదారులు యాప్ స్టోర్, గూగుల్ ప్లే రెండింటిలోనూ లభించే గ్రీన్ ఎస్ఎమ్ యాప్ ద్వారా గ్రీన్ ఎస్ఎమ్ లిమో రైడ్ను బుక్ చేసుకోవచ్చు.


