వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం, సామాన్యులకు ఊరట  | Govt extends concessional import duties on edible oil by six months | Sakshi
Sakshi News home page

Edible Oils: కేంద్రం కీలక నిర్ణయం, సామాన్యులకు ఊరట 

Sep 2 2022 8:26 AM | Updated on Sep 2 2022 8:27 AM

Govt extends concessional import duties on edible oil by six months - Sakshi

న్యూఢిల్లీ: వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్‌ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్‌ సుంకం కొనసాగుతుందని ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ప్రకటించింది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, ధరలు నియంత్రణలో ఉంటాయని పేర్కొంది.

ముడి పామాయిల్, ఆర్‌బీడీ పామోలీన్, ఆర్‌బీడీ పామ్‌ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్‌ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్‌ ఆయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతులపై సుంకాల్లేవు. కాకపోతే 5 శాతం అగ్రి సెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్‌ కలుపుకుని 5.5 శాతం పడుతోంది.

రిఫైన్డ్‌ నూనెలు అయితే, పామాయిల్‌పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్‌ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్‌పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉంది. వినియోగదారుల ప్రయోజనాల కోణంలో సుంకాల రాయితీని కేంద్రం పొడిగించినట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షర్స్‌ అసోసియేషన్‌ ఈడీ బీవీ మెహతా తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement