కోల్కతా: దేశీయంగా పసిడి రుణాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, సెక్యూరిటైజేషన్ మార్కెట్లో వాహన రుణాల విభాగాన్ని బంగారం రుణాల విభాగం అధిగమించింది. క్రిసిల్ రేటింగ్స్ నివేదికలో ఇది వెల్లడైంది.
క్యూ1లో సెక్యూరిటైజేషన్ పరిమాణంలో గోల్డ్ లోన్స్ వాటా 31 శాతంగా ఉండగా, వాహన రుణాల వాటా 26 శాతంగా నమోదైంది. మార్టిగేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ పరిమాణం 12 శాతంగా, బిజినెస్ లోన్ సెక్యూరిటైజేషన్ 10 శాతంగా, మైక్రోఫైనాన్స్ రుణాలు 14 శాతంగా రికార్డయ్యాయి. ఆర్థిక సంస్థలు తామిచ్చిన రుణాలను పూలింగ్ చేసి ఇతర ఇన్వెస్టర్లకు విక్రయించి, తదుపరి మరిన్ని రుణాలివ్వడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడాన్ని సెక్యూరిటైజేషన్గా వ్యవహరిస్తారు.
ఇలాంటి ఇష్యూలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 22 శాతం పెరిగి రూ. 60,000 కోట్లకు చేరినట్లు క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. ఇందులో 98 శాతం ఇష్యూలను నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలే (ఎన్బీఎఫ్సీ) జారీ చేశాయి. గతంలో ఇందుకు భిన్నంగా సింహభాగం వాటా బ్యాంకులది ఉండేది.


