ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో మేనేజర్లు, ఉద్యోగుల మధ్య సంబంధాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అద్దం పట్టే సంఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనారోగ్య సెలవు (సిక్ లీవ్) అడిగినందుకు సదరు ఉద్యోగిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డిమాండ్ చేసిన బాస్కు ఒక జెన్ జీ ఉద్యోగి ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆన్లైన్లో చర్చకు దారితీసింది.
అసలేం జరిగిందంటే..?
ఎక్స్ వేదికగా వైరల్ అవుతున్న ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ ప్రకారం.. ఒక ఉద్యోగి తన మేనేజర్కు మెసేజ్ చేస్తూ, ‘సార్ నహీ ఆ పావంగా, ఫీవర్ బడ్ గయా హై’(సార్.. నేను రాలేను, నాకు జ్వరం ఎక్కువైంది) అని సమాచారం ఇచ్చాడు. దీనికి బాస్ స్పందిస్తూ, ‘చలో డాక్టర్ కే పాస్ చల్తే హై’(డాక్టర్ వద్దకు వెళ్తున్నావా) అని బదులిచ్చాడు. ప్రస్తుతానికి తాను ట్యాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నానని, అవసరమైతేనే డాక్టర్ వద్దకు వెళ్తానని ఉద్యోగి స్పష్టం చేశాడు. అయితే, అంతటితో ఆ సంభాషణ ముగియలేదు.
‘డైరెక్టర్ సర్ నే కహా హై జో భీ బిమార్ హో ఉస్సే డాక్టర్ కి ప్రిస్క్రిప్షన్ లో’(అనారోగ్యంతో సెలవు అడిగే ప్రతి ఒక్కరి నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సేకరించాలని డైరెక్టర్ గారు ఆదేశించారు) అంటూ మేనేజర్ ఒత్తిడి తెచ్చాడు.
మేనేజర్ మాటలకు సదరు జెన్ జీ ఉద్యోగి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘మై స్కూల్ స్టూడెంట్ నహీ హూన్ సర్. లీవ్ రెహ్తీ హై, లీవ్ మై’ (నేను స్కూల్ స్టూడెంట్ని కాదు సార్. నాకు సెలవు అందుబాటులో ఉంది, అందుకే తీసుకుంటున్నాను) అని తేల్చిచెప్పాడు. అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రిస్క్రిప్షన్ అంత తప్పనిసరి అయితే, కంపెనీ డైరెక్టరే స్వయంగా డాక్టర్ కాబట్టి తన పేరు మీద ఆయన్నే ఒక ప్రిస్క్రిప్షన్ రాసుకోమనాలని సూచించాడు. అంతేకాకుండా, తన తల్లిదండ్రులు సంతకం చేసిన లీవ్ లెటర్లు తన వద్ద లేవని, ప్రస్తుతానికి తాను విశ్రాంతి తీసుకుంటున్నందున ఇకపై వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లకు స్పందించనని చాటింగ్ను ముగించాడు.
నెటిజన్ల స్పందన
ఈ స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపట్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. ‘భారతీయ మేనేజర్లు తమ కింద పనిచేసేవారిని ఉద్యోగులుగా కాకుండా, బానిసలుగా భావిస్తారు. జెన్ జీ ఉద్యోగి ఇచ్చిన ప్రతిస్పందన అద్భుతం’ అంటూ కొందరు సదరు యువకుడికి మద్దతుగా నిలిచారు. కంపెనీలు ఉద్యోగులకు వార్షిక సెలవులు కేటాయించినప్పుడు, ఒక రోజు అనారోగ్య సెలవు కోసం కూడా మెడికల్ సర్టిఫికెట్లు అడగడం వారిపై నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: బెంగళూరు ఐటీ కారిడార్లో ఘోరం


