ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ లిమిటెడ్ బోర్డు ఓపెన్ మార్కెట్ ద్వారా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఒక్కో షేరుకీ రూ. 475 ధరలో 1.36 శాతం వాటాకు సమానమైన 59.36 లక్షల షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఇందుకు రూ. 282 కోట్లు వెచ్చించనుంది. గురువారం బీఎస్ఈలో ఇమామీ ముగింపు ధర రూ. 376తో పోలిస్తే బైబ్యాక్కు 26 శాతంపైగా ప్రీమియం ప్రకటించింది.
కాగా.. ఆఫర్ ధర కంటే తక్కువలో షేర్లు లభిస్తే బైబ్యాక్ పరిమాణం పెరిగే వీలున్నట్లు ఇమామీ పేర్కొంది. అయితే దీనిలో భాగంగా రూ. 475 ధర మించకుండా బైబ్యాక్కు రూ. 282 కోట్లవరకూ వెచ్చించనుంది. సాధారణ వాటాదారులతోపాటు ప్రమోటరేతర సంస్థలు, వ్యక్తుల నుంచి షేర్లను కొనుగోలు చేయనున్నట్లు ఇమామీ తెలియజేసింది.
బైబ్యాక్లో భాగంగా కనీసం రూ. 212 కోట్లు వెచ్చించి 44.52 లక్షల షేర్లు(75 శాతం) కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. ఇమామీ షేరు బీఎస్ఈలో ఈ సెప్టెంబర్ 1న రూ. 361 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకగా.. 2025 సెప్టెంబర్ 18న రూ. 612 వద్ద 52 వారాల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే.


