న్యూఢిల్లీ: ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల కోసం దేశీయంగా ఈ85 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియన్ఆయిల్ రిటైల్ ఔట్లెట్లో కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి దీన్ని ఆవిష్కరించారు.
సాధారణ పెట్రోల్తో పోలిస్తే దీని ధర లీటరుకు రూ. 20 మేర తక్కువకే లభిస్తుంది. ప్రాథమికంగా ఇది ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే లభిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యుయల్ ఇంజిన్లున్న వాహనాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించడానికి వీలవుతుంది. తొలుత 48 ప్రభుత్వ రంగ బంకులతో ప్రారంభించి 2026 డిసెంబర్ నాటికి 500 ఔట్లెట్స్లో, 2027 డిసెంబర్ నాటికి 5,000 ఔట్లెట్స్లోను అందుబాటులోకి తెస్తారు.
80–85 శాతం ఇథనాల్, 14–19 శాతం పెట్రోల్ ఉండే మిశ్రమ ఇంధనాన్ని ఈ85గా వ్యవహరిస్తారు. ఈ20 నుంచి ఈ100 వరకు ఇథనాల్ మిశ్రమాలపై పని చేసే ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలకు ఇది అనువుగా ఉంటుంది.


