Dhirubhai Ambani Death Anniversary: Interesting Facts About the Business Tycoon - Sakshi
Sakshi News home page

వి మిస్‌ యూ పప్పా: ఈ రోజు దేశం చేస్తున్న పని ఆయన ఎప్పుడో చేశారు!

Jul 6 2023 4:31 PM | Updated on Jul 6 2023 5:58 PM

Dhirubhai Ambani death anniversary here interesting truths - Sakshi

ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్‌ ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ (ధీరూభాయ్‌) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.   జూలై 6 ఆయన వర్ధంతి సందర్భంగా ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌ ఫుల్‌ జర్నీని తెలుసుకుందాం. "కష్టాలు ఎదురైనా మీ లక్ష్యాలను సాధించండి, ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకోండి’’ అనేది ధీరూభాయ్‌ అంబానీ  సందేశం. నిజ జీవితంలో ఆయన అదే ఆచరించి చూపారు. ఎంతో మంది పారిశ్రామిక వేత్తలకు   స్ఫూర్తిగా నిలిచారు. 

టీనా అంబానీ ఘన నివాళి
ఈ రోజు దేశమంతా చేస్తున్న పనిని ఆయన  ఎప్పుడో పూర్తి చేశారు. అదీ ఆయన దార్శనికత.  చాలా విధాలుగా  ఆయన కాలం కంటే ముందే ఉన్నారు. ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్ ఆలోచించమని,అత్యుత్తమంగా ఉండాలని, మనల్ని మనం అంకితం చేసుకోవాలని ప్రోత్సహించిన నిజమైన దార్శనికుడు. పప్పా ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతున్నాం.  మీరందించిన అనంతమైన జ్ఞానాన్న మా నిజ జీవితాల్లో వర్తింపజేయడానికి ప్రయత్నిస్తాం అంటూ ఆయన  కోడలు, అనిల్‌ అంబానీ భార్య టీనా అంబానీ నివాళులర్పించారు.

మరోవైపు ధీరూభాయ్ పెద్ద కోడలు, బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ తన "అత్యంత స్ఫూర్తిదాయకమైన గురువు" అంటూ  గురు పూర్ణిమ రోజు ఎన్‌ఎంఏసీసీలో నిర్వహించిన పరంపర కార్యక్రమంలో ఘన నివాళులర్పించారు. 

 ధీరూ భాయ్‌ అంబానీ కొన్ని ఆసక్తికర విషయాలు
దిగ్గజ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్‌  పదో తరగతి మాత్రమే పూర్తి చేశారంటే నమ్ముతారా? ఒకప్పుడు పెట్రోల్ పంపులో పని.. కానీ ఆ తరువాత  వేల  కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగాఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి అంతగా తెలియని  ఆసక్తికరమైన విషయాలు

సాధారణ కుటుంబంలో జననం, కష్టాలు
ధీరూభాయ్ అంబానీ గుజరాత్, జునాగద్ జిల్లాలో చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 1932, డిసెంబరు 28న జన్మించారు.  సామాన్య టీచర్‌ కుటుంబంలో నలుగురు తోబుట్టువులతో జీవితం కష్టాలతోనే ప్రారంభమైంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ అంబానీ తన చదువును కూడా మధ్యలోనే వదిలివేసి కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేశారు. 

పెట్రోలు బంకులో పని, నెలకు రూ.300
బిలియన్ డాలర్ల కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ప్రారంభంలో బ్రిటిష్ కాలనీ ఆఫ్ అడెన్‌లోని పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేశారు. ఆ సందర్భంగా నెలకు 300రూపాయలు జీతంగా తీసుకునేవారట. అంతకుముందు కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్‌కు వలస వెళ్లి పెట్రోల్‌ బంకులో పని మొదలు పెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తీప్పింది. సూయజ్‌కు తూర్పున ఉన్న అతిపెద్ద ఖండాంతర వాణిజ్య సంస్థలో ట్రేడింగ్, అకౌంటింగ్, ఇతర వ్యాపార నైపుణ్యాలను నేర్చుకున్నారు. కొన్నేళ్లలోనే మంచి స్థానానికి ఎదిగారు. ఆ తరువాత అన్నింటినీ వదిలి తిరిగి భారతదేశానికి  తిరిగి వచ్చేశారు. 

రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్
ఇండియాకి వచ్చిన తరువాత 1958లో తన బంధువు చంపక్‌లాల్‌దమానీతో కలిసి తొలి కంపెనీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ (సుగంధ ద్రవ్యాలు, నూలు వ్యాపారం)  కంపెనీ స్థాపించారు. నూలు వ్యాపార పరిశ్రమలో పెరుగుతున్న అవకాశాలను గుర్తించిన తర్వాత ధీరూభాయ్ తన వ్యాపారాన్ని మార్చేశారు. మూడేళ్ల తర్వాత 1962లో రిలయన్స్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను లాంచ్‌ చేశారు. బంధువు చంపక్‌లాల్‌ దమానీతో విడిపోయిన తరువాత 1966లో గుజరాత్లోని అహ్మదాబాద్లో 'రిలయన్స్ టెక్స్‌టైల్స్‌' అనే బట్టల మిల్లును ప్రారంభించారు. దీంతో అతని జీవితంలో అత్యంత మలుపు తిరిగింది. ఇక తరువాత మళ్ళీ ఎప్పుడూ వెనుదిరిగి చూసింది లేదు. అంచెలంచెలుగా రిలయన్స్‌ సామ్రాజాన్నివిస్తరించారు. అలాగే భారతదేశంలోని సగటు పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్‌ను పరిచయం చేసిన ఘనత అంబానీకి దక్కుతుందని మార్కెట్‌ నిపుణులమాట.

భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఫార్చ్యూన్ 500లోచోటు దక్కించుకున్న తొలి ఇండియన్‌ ప్రైవేట్  కంపెనీగా  రిలయన్స్ టెక్స్‌ టైల్స్‌ నిలిచింది. అలాగే 1996, 1998, 2000 సంవత్సరాల్లో ఆసియావీక్ పత్రిక 'పవర్ 50- ఆసియాలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్' జాబితాలో చేరారు. దీంతోపాటు1999 సంవత్సరంలో బిజినెస్ ఇండియా  'బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నారు. 69 ఏళ్ల వయసులో ధీరూభాయ్‌ అంబానీ 2002 జూలై 6న ముంబైలో కన్నమూశారు. 

ఖరీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారు
తాజా వ్యాపార ఆలోచనలకోసం, తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, ధీరూభాయ్ అంబానీ సంపన్న వ్యాపారవేత్తలతో కలిసి తిరిగేవారట. నెట్‌వర్క్ , పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి, ఖనీదైన  రెస్టారెంట్లలో టీ తాగేవారని చెబుతారు.

ధీరూభాయ్ అంబానీ భార్య పేరు కోకిలాబెన్. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు ముఖేశ్‌ అంబానీ, అనిల్ అంబానీ, నినా కొఠారి, దీప్తి సల్గోకర్. ఆస్తులను తన ఇద్దరు కుమారులు ముఖేశ్‌, అనిల్‌ అంబానీలకు పంచి ఇచ్చారు. 2002లో ఆయన మరణించే ముందు వరకు కంపెనీని పర్యవేక్షించిన ఆయన 1980ల మధ్యకాలంలో తన కుమారులు ముఖేశ్‌ అంబానీ, అనిల్ అంబానీలకు అప్పగించారు, ఆయన వారసత్వాన్ని అందుకున్న ముఖేశ్‌ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా అత్యంత సంపన్నుడుగా, ఆసియా బిలియనీర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement