సీఎంఎస్‌ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు | Sakshi
Sakshi News home page

సీఎంఎస్‌ ఇన్ఫోలో మహిళా డైరెక్టర్లు

Published Thu, Jan 6 2022 1:50 AM

CMS Info Systems appoints two women independent directors - Sakshi

న్యూఢిల్లీ: క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ తాజాగా ఇద్దరు మహిళా డైరెక్టర్లను నియమించుకుంది. కార్పొరేట్‌ పాలన నిబంధనలకు అనుగుణంగా స్వతంత్ర డైరెక్టర్ల హోదాలో మంజు అగర్వాల్, ఎస్‌.వసంత్‌ కారన్‌జ్‌కర్‌లను ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్యాంకింగ్, డిజిటల్‌ బ్యాంకింగ్, ఫిన్‌టెక్‌ విభాగాలలో వీరికి సీనియారిటీ ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో బోర్డులో మహిళా డైరెక్టర్ల సంఖ్య మూడుకు చేరినట్లు తెలియజేసింది.

ఆరుగురు సభ్యుల బోర్డుకు చైర్‌పర్శన్, నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్యామలా గోపీనాథ్‌ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్‌ సుపరిపాలన విషయంలో కంపెనీ పాటిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలకు తాజా ఎంపికలు నిదర్శనాలని సీఎంఎస్‌ ఇన్ఫో పేర్కొంది. తద్వారా ముగ్గురు లేదా అంతకుమించి మహిళా డైరెక్టర్లు కలిగిన ఎన్‌ఎస్‌ఈ టాప్‌–10 శాతం లిస్టెడ్‌ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించినట్లు వివరించింది.  

బ్యాక్‌గ్రౌండ్‌..: అగర్వాల్‌ ఎస్‌బీఐలో 34ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. దేశ, విదేశాలలో రిటైల్, డిజిటల్‌ బ్యాంకింగ్, కస్టమర్‌ సర్వీసులు, వ్యూహాలు, నిర్వహణ తదితర విభాగాలలో విధులు చేపట్టారు. ఇక వసంత్‌ కారన్‌జ్‌కర్‌ కన్జూమర్‌ లెండింగ్‌ సంస్థ పేసెన్స్‌కు సహవ్యవస్థాపకురాలిగా వ్యవహరించారు. బిజినెస్, వృద్ధి, నిర్వహణ విభాగాలకు అధికారిణిగా బాధ్యతలు నిర్వహించారు. పేయూ క్రెడిట్‌ ఇండియాకు చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. పేసెన్స్‌ పురోగతి సాధించాక పేయూ ఇండియాకు చెందిన నాస్పెర్స్‌కు విక్రయించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement