ఒక్కో ట్రిప్పుపై రూ.300-రూ.400 భారం | Cab Fares Surge Pune Mumbai Route 300 400 Extra Per Trip Amid Fuel Price Hike | Sakshi
Sakshi News home page

ఒక్కో ట్రిప్పుపై రూ.300-రూ.400 భారం

Jun 3 2026 12:34 PM | Updated on Jun 3 2026 12:36 PM

Cab Fares Surge Pune Mumbai Route 300 400 Extra Per Trip Amid Fuel Price Hike

వరుసగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా ఉంది. ఇంధన ఖర్చులు భారంగా మారడంతో పుణె-ముంబై మార్గంలో నడిచే క్యాబ్ ఆపరేటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు చెప్పారు. ఈ సవరించిన రేట్లు నిత్యం ప్రయాణించే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

రూ.300 - రూ.400 అదనం!

గత కొన్ని నెలలుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల భారాన్ని క్యాబ్ డ్రైవర్లు, ఆపరేటర్లు భరిస్తూ వచ్చారు. అయితే, మే నెలలో ధరలు పదేపదే పెరగడంతో ఇక లాభాలు రాకపోగా చేతి డబ్బులు పోయే పరిస్థితి రావడంతో ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు డ్రైవర్లు చెప్పారు. వాహనం రకాన్ని బట్టి ఛార్జీల పెంపుదల మారుతుందని, అయితే సగటున పుణె-ముంబై వన్-వే ప్రయాణానికి ఇప్పుడు రూ.300 నుంచి రూ.400 వరకు అదనంగా ఖర్చు అవుతుందని పుణెకు చెందిన క్యాబ్ ఆపరేటర్ జ్ఞానేశ్వర్ షెల్కే తెలిపారు. టోల్ ఛార్జీలు మినహాయించి కిలోమీటరుకు వసూలు చేసే బేస్ రేటు రూ.19 నుంచి రూ.20కి పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

చేతులెత్తేసిన ఆపరేటర్లు..

పుణె-ముంబై రూట్‌లో నిత్యం ప్రయాణించే విశాల్ జాదవ్ అనే క్యాబ్ డ్రైవర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘నా వద్దకు వచ్చే ప్రయాణికుల్లో 80 శాతం మంది అంతర్జాతీయ విమానాల కోసం ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేవారే. మే నెలలోనే వరుసగా మూడుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఆ కార్యాచరణ ఖర్చులను మేం భరించలేకే ఈ భారాన్ని ప్రయాణికులపై వేయాల్సి వచ్చింది. పాత కస్టమర్లు పరిస్థితిని అర్థం చేసుకుంటున్నప్పటికీ కొత్త ప్రయాణికులు మాత్రం పెరిగిన రేట్లు చూసి వెనకడుగు వేస్తున్నారు’ అన్నారు.

ఈ పెరిగిన ధరల వల్ల క్యాబ్ ప్రయాణం మధ్యతరగతికి భారంగా మారుతోంది. ధరల పట్ల అత్యంత సున్నితంగా ఉండే కొత్త కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. క్యాబ్ ఛార్జీలు బడ్జెట్ దాటిపోతుండటంతో చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు లగ్జరీ బస్సులు లేదా రైలు ప్రయాణాలను ఎంచుకుంటున్నారని ఆపరేటర్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్‌కు హక్కు దక్కేనా?

Advertisement
 
Advertisement
Advertisement