
సెబీకి ప్రాస్పెక్టస్ల దాఖలు
జాబితాలో డజను పైగా కంపెనీలు
రూ. 50,000 కోట్లకు పైగా సమీకరించే అవకాశం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగం) కంపెనీలు భారీ స్థాయిలో పబ్లిక్ ఇష్యూకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి పలు కంపెనీలు ఇప్పటికే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లు దాఖలు చేశాయి. కొత్తగా షేర్లను జారీ చేయడం లేక ఆఫర్ ఫర్ సేల్ రూపంలో లేదా రెండింటి మేళవింపుతో ఈ ఇష్యూలు ఉండబోతున్నాయి.
మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇష్యూల ద్వారా బీఎఫ్ఎస్ఐ కంపెనీల నిధుల సమీకరణ రూ. 50,000 కోట్ల మార్కును దాటేసే అవకాశం ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన దానికి మూడు రెట్లు అధికం. 2025 ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్ఎస్ఐ రంగానికి చెందిన ఎనిమిది కంపెనీలు ఐపీవోల ద్వారా సుమారు రూ. 16,275 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 10 సంస్థలు రూ. 9,655 కోట్ల మొత్తాన్ని పబ్లిక్ ఇష్యూల ద్వారా సమకూర్చుకున్నాయి.
హెచ్డీబీ ఫైనాన్షియల్ రూ. 12,500 కోట్లు...
పబ్లిక్ ఇష్యూలకు వస్తున్న వాటిలో హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (రూ. 12,500 కోట్లు), క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ (5,000 కోట్లు), అవాన్స్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (రూ. 3,500 కోట్లు), హీరో ఫిన్కార్ప్ (రూ. 3,668 కోట్లు), వెరిటాస్ ఫైనాన్స్ (రూ. 2,800 కోట్లు), ఎస్కే ఫైనాన్స్ (రూ. 2,200 కోట్లు) మొదలైన సంస్థలు ఉన్నాయి.
టాటా క్యాపిటల్ నిర్దిష్టంగా ఎంత సమీకరించేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ అన్లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ తీరుతెన్నులను బట్టి చూస్తే 2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఇష్యూ ఉండొచ్చని భావిస్తున్నారు. కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ మొదలైనవి కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
వ్యాపార అవసరాలరీత్యా..
నియంత్రణ సంస్థపరమైన నిబంధనలు, మార్కెట్.. వ్యాపార అవసరాల రీత్యా పలు బీఎఫ్ఎస్ఐ కంపెనీలు ఐపీవో బాట పడుతున్నాయి. దాదాపు డజను పైగా సంస్థలు పబ్లిక్ ఇష్యూకి సిద్ధమవుతున్నాయి. కొంతకాలం పాటు మందగించిన ఈక్విటీ మార్కెట్లు, మళ్లీ కనిష్ట స్థాయుల నుంచి 15–20 శాతం పుంజుకున్నాయని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ హెడ్ (ఫండమెంటల్ రీసెర్చ్ – ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్) నరేంద్ర సోలంకి తెలిపారు.
దీంతో ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు బీఎఫ్ఎస్ఐ సంస్థలు ధీమాగా ముందుకొస్తున్నాయని వివరించారు. ఇక లిక్విడిటీ కొరతను అధిగమించేందుకు ఆయా కంపెనీల మాతృసంస్థలు .. ముఖ్యంగా బ్యాంకులకు, ఈ ఐపీవోలు కొంత ఉపయోగకరంగా ఉండగలవని తెలిపారు. క్యాపిటల్ అడిక్వసీ నిష్పత్తి నిబంధనలను పాటించడానికి, కార్యకలాపాల విస్తరణకు, రుణభారాలను తగ్గించుకునేందుకు ఐపీవోలు వ్యూహాత్మక మార్గంగా ఉంటాయని ప్రమోటర్లు భావిస్తున్నట్లు వివరించారు.
చాలా కంపెనీలు వ్యాపార వృద్ధికి అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకునేందుకు, నియంత్రణ సంస్థపరమైన నిబంధనలు పాటించేందుకు, నిధుల సమీకరణకు ఉపయోగపడే వనరులను పెంచుకునేందుకు చాలా మటుకు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బీమా సంస్థలు, ఫిన్టెక్ సంస్థలు ప్రైమరీ మార్కెట్ల బాట పడుతున్నాయి.
బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ), రిజర్వ్ బ్యాంక్ నిబంధనల కారణంగా పారదర్శకత, గవర్నెన్స్పరమైన ప్రమాణాలను మెరుగుపర్చుకునేందుకు ఐపీవోలకు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇన్వెస్టర్లు ఆచితూచి కంపెనీలను ఎంచుకుంటున్న నేపథ్యంలో ఈ ఐపీవోల్లో ఎన్ని భారీ స్థాయిలో విజయవంతమవుతాయో చూడాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.