అనంత్‌తో పెళ్లి.. అంబానీ కోడలి ఆసక్తికర వ్యాఖ్యలు | Ambanis choti bahu Radhika Merchant on Marriage Money Womens Empowerment | Sakshi
Sakshi News home page

అనంత్‌తో పెళ్లి.. అంబానీ కోడలి ఆసక్తికర వ్యాఖ్యలు

Jun 11 2026 8:29 PM | Updated on Jun 11 2026 8:49 PM

Ambanis choti bahu Radhika Merchant on Marriage Money Womens Empowerment

దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అంబానీ కుటుంబానికి కోడలైన రాధికా మర్చంట్‌ మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (IIMUN) కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. వివాహ బంధంలో సమానత్వం, పరస్పర గౌరవం, మహిళల ఆర్థిక స్వేచ్ఛ ప్రాముఖ్యతపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అనంత్ అంబానీతో వివాహంపై..

అనంత్ అంబానీతో తన దాంపత్య జీవితం గురించి మాట్లాడుతూ, ఒక విజయవంతమైన వివాహానికి ‘ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు’ అన్న భావన కంటే పరస్పర గౌరవమే ముఖ్యమని చెప్పారు. ప్రతి సంబంధంలో రాజీలు సహజమేనని, కొన్ని సందర్భాల్లో అనంత్ తన అభిప్రాయాన్ని పక్కన పెడతారని, మరికొన్ని సందర్భాల్లో తాను రాజీ పడతానని పేర్కొన్నారు. అయితే, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకునేంత వరకు ఆ బంధం సమానత్వంతోనే కొనసాగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై మాట్లాడిన రాధికా, కుటుంబ నేపథ్యం ఎంత గొప్పదైనా, జీవిత భాగస్వామి ఎంత సంపన్నుడైనా, ప్రతి మహిళ తన సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. “మీరు ఎవరి కుమార్తె అయినా, ఎవరి భార్య అయినా, మీ జీవితంలో ఎంత సౌకర్యంగా ఉన్నా సరే, మీ నిర్ణయాలు మీరే తీసుకునే శక్తి ఉండాలంటే ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం” అని ఆమె అన్నారు.

అది ప్రమాదకరం

ఆర్థికంగా పూర్తిగా ఇతరులపై ఆధారపడటం ప్రమాదకరమని హెచ్చరించిన ఆమె, జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని పేర్కొన్నారు. “మీకు బయటపడే అవకాశం లేనంతగా ఏదైనా పరిస్థితికి బంధించబడకండి” అని రాధిక సూచించారు.

సమాజంలో నిజమైన లింగ సమానత్వం సాధించాలంటే మహిళలకు విద్య, ఉపాధి, వ్యాపారం, ఆస్తుల సృష్టి వంటి రంగాల్లో మరింత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని రాధిక అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక సాధికారత లేకుండా సంపూర్ణ సమానత్వం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక స్వేచ్ఛ కుటుంబాల్లో నిర్ణయాధికారాన్ని పెంచుతుందని, వ్యక్తిగత గౌరవాన్ని బలోపేతం చేస్తుందని పలువురు నిపుణులు కూడా చెబుతున్నారు.

ప్రముఖ వ్యాపారవేత్తలు వీరేన్ మర్చంట్‌, శైలా మర్చంట్‌ల కుమార్తె రాధికా మర్చంట్‌ 1994లో ముంబైలో జన్మించారు. న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్స్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె, భారతీయ శాస్త్రీయ నృత్యంలో కూడా శిక్షణ పొందారు. ప్రస్తుతం కుటుంబానికి చెందిన ఆరోగ్య సంరక్షణ వ్యాపార సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. అనంత్ అంబానీతో గత ఏడాది జరిగిన ఆమె వివాహం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం పొందింది.

Advertisement
 
Advertisement
Advertisement