Air India: టాటా గూటికి ఎయిర్ ఇండియా చేరేది అప్పుడే!
Air India to be handed over to Tata Group: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా గత ఏడాది టాటా గ్రూప్ వేలంలో రూ.18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల కంపెనీగా మారబోతుంది. ఈ విమానయాన సంస్థ పూర్తి భాద్యతలను ఈ వారం చివరి నాటికి టాటా గ్రూప్కు అప్పగించాలని చూస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఈ జనవరి 27, 2022న ఎయిర్ ఇండియా పూర్తిగా టాటాల పరం కానున్నట్లు ఈ విమానయాన సంస్థ ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. అందుకు, సంబంధించిన ప్రక్రియను వచ్చే రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు.
గత ఏడాది జరిగిన పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియలో ప్రభుత్వ రంగ ఎయిరిండియాను అత్యధికంగా రూ. 18,000 కోట్ల బిడ్తో టాటా గ్రూప్ దక్కించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకు తేలిసిందే. ఎయిరిండియాకు సంబంధించి రూ.15,300 కోట్ల రుణభారాన్ని తీసుకోవడంతో పాటు రూ. 2,700 కోట్లు నగదు చెల్లించేలా టాటా గ్రూప్లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్ చేసినట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు.
ఈ ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100 శాతం వాటాలు, ఎయిరిండియా ఎస్ఏటీఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ (ఏఐఎస్ఏటీఎస్)లో 50 శాతం వాటాలను టాలేస్ కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి టాటా సన్స్, కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 25న ఒప్పందం కుదుర్చుకొని సంతకాలు చేశాయి. ఈ జనవరి 20తో ముగిసిన బ్యాలెన్స్ షీట్'ను జనవరి 24 అందించాల్సి ఉంటుంది. తర్వాత దీనిని టాటా సమీక్షించవచ్చు, ఏవైనా మార్పులు చేయవచ్చు అని ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఫైనాన్స్ వినోద్ హెజ్మాడీ ఉద్యోగులకు గతంలో మెయిల్లో తెలిపారు.
(చదవండి: ఐఐటీ పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ.. తగ్గనున్న ఎలక్ట్రికల్ వాహన ధరలు!)
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు