అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్లో.. దాదాపు రెండు దశాబ్దాలుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొనసాగుతోన్న శంతను నారాయణ్ ఆ పదవికి రాజీనామా చేయనున్నట్లు కొన్ని వదంతులు వినిపించాయి. దీనిపై కంపెనీ స్పందిస్తూ.. కొత్త సీఈఓగా వేరొకరు బాధ్యతలు స్వీకరించే వరకు శంతను సీఈఓగా కొనసాగుతారని స్పష్టం చేసింది.
అడోబ్ కంపెనీ సీఈఓను ఎందుకు మారుస్తోంది?, లేదా.. శంతను నారాయణ్ ఎందుకు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు అనేదానికి కారణాలు ఏమిటనేది అధికారికంగా వెల్లడి కాలేదు. శంతను సీఈఓగా తప్పుకున్నప్పటికీ.. సంస్థ బోర్డు ఛైర్మన్గా కొనసాగుతారని కంపెనీ పేర్కొంది.
అడోబ్ బోర్డు కొత్త సీఈఓను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంస్థలో ఉన్న అభ్యర్థులతో పాటు బయటి అభ్యర్థులను కూడా పరిశీలిస్తుంది. కాగా సంస్థ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫ్రాంక్ కాల్డెరోని మాట్లాడుతూ.. శంతను నారాయణ్ గత 18 సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధికి కృషి చేసారని ప్రశంసించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో అడోబ్ విజయానికి ఆయన వేసిన పునాది ఎంతో కీలకమని చెప్పారు.
శంతను సీఈఓగా తప్పుకోవాలనుకుంటున్న నిర్ణయాన్ని బోర్డుకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 18 సంవత్సరాలుగా సీఈఓగా బాథ్యతలు నిర్వర్తించాను. కొత్త సీఈఓ ఎంపిక పూర్తయ్యే వరకు తాను బోర్డుతో కలిసి పనిచేసి.. బాధ్యతల మార్పు జరిగేలా చూస్తానని తెలిపారు.
ఇదీ చదవండి: గ్యాస్ కష్టాలు.. ఆఫీసుకు రాకండి, ఇంట్లో పనిచేసుకోండి
ఈ సందర్భంగా తన నాయకత్వ కాలాన్ని గుర్తు చేసుకుంటూ అడోబ్ సంస్థ సాధించిన అభివృద్ధిని వివరించారు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు కంపెనీలో సుమారు 3,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 30,000 మందికి పైగా పెరిగిందని చెప్పారు. అలాగే కంపెనీ ఆదాయం కూడా ఒక బిలియన్ డాలర్ల కంటే తక్కువ స్థాయి నుంచి 25 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని తెలిపారు. అడోబ్ తయారు చేసిన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను చేరుకుందని ఆయన గర్వంగా చెప్పారు.


