న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్లు, ఎంఎస్ఎంఈలకు మరింత రుణ వితరణకు వీలుగా ఆవాస్ ఫైనాన్షియర్స్తో ఆసియా అభివృద్ధి బ్యాంక్ చేతులు కలిపింది. 108 మిలియన్ డాలర్ల (సుమారు రూ.983 కోట్లు) సీనియర్ సెక్యూర్డ్ డెట్ ఫైనాన్సింగ్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.
తక్కువ ఆదాయ వర్గాలు కొనుగోలు చేసే ఇళ్లు, రుణ సాయం అంతగా విస్తరించని రాష్ట్రాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈలు) సంస్థలకు రుణ వితరణ కోసం ఈ నిధులను ఆవాస్ ఫైనాన్షియర్స్ వినియోగించనుందని ఏడీబీ ప్రకటించింది. సొంతంగా నిర్మించుకునే ఇళ్లు, పర్యావరణ అనుకూల ఆమోదిత ఇళ్లు, ఇంధన ఆదా పరిష్కారాలతో నిర్మించిన ఇళ్ల కోసం రుణాలను అందించనుంది.
మహిళలకు ప్రాధాన్యం
గృహ రుణాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ముఖ్యంగా ఏడీబీ అందించే సాయంలో 70 శాతం మేర తక్కువ ఆదాయ వర్గాల ఇళ్ల కొనుగోళ్లకు రుణాలుగా అందించనున్నారు. 50 శాతం మేర రుణాలను మహిళలకే ఇవ్వనున్నారు. మిగిలిన 30 శాతం నిధులను ఎంఎస్ఎంఈలకు అందించనున్నారు. 8 మిలియన్ డాలర్లను రాయితీ రేటుపై అందించడం కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది.


