
గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ జూన్ 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ సైకిల్ను ప్రకటించింది. ఇందులో భారతదేశంలో 15,000 మంది ఉన్నారు. ఐటీ కన్సల్టింగ్ డిమాండ్ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులపై పరిశీలన పెరగడంతో ఈ ప్రమోషన్లలో ఆరు నెలలపాటు జాప్యం జరిగింది. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు నిలిచిపోయిన ప్రమోషన్లను జూన్లో ప్రకటిస్తామని తెలిపింది. ఈమేరకు బ్లూమ్బర్గ్ వివరాలు వెల్లడించింది.
సాంప్రదాయంగా యాక్సెంచర్ డిసెంబరులో ప్రమోషన్లను ప్రకటించింది. కానీ క్లయింట్ డిమాండ్, బడ్జెట్కు అనుగుణంగా ప్రమోషన్ చెల్లింపులు లేకపోవడంతో ఆ సైకిల్ను జూన్కు మార్చారు. స్థిరమైన వార్షిక షెడ్యూల్ ప్రకారం కాకుండా వ్యాపార అవసరాల ఆధారంగా ఉద్యోగులను ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమోషన్లు భారతదేశంలో 15,000, యూరప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (ఈఎంఈఏ) దేశాల్లో 11,000, అమెరికాలో 10,000గా ఉండనున్నాయి.
ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
అధిక వృద్ధి రంగాల్లోని ఉద్యోగులకు మూల వేతన పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే బోనస్, ఈక్విటీ ఆధారిత పరిహార నిర్ణయాలను 2025 డిసెంబర్కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ విధానం యాక్సెంచర్ పనితీరును, ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడానికి అనుమతిస్తుందని చెబుతున్నారు. 2023లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ప్రపంచ ఆర్థిక సవాళ్లకు సమర్థంగా ప్రతిస్పందించడానికి, మారుతున్న కస్టమర్ డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ 19,000 ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఆర్థిక వివేకాన్ని పాటిస్తూ ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని పెంపొందించేలా కొత్త ప్రమోషన్ వ్యూహాన్ని రూపొందించింది.