మార్చిలో విమానయానం జూమ్‌

1. 06 crore domestic passengers travelled in March - Sakshi

1.06 కోట్లమంది ప్రయాణికులు

ఫిబ్రవరితో పోలిస్తే 38 శాతం అప్‌

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి తదుపరి దేశీ విమానయానం ఊపందుకుంటోంది. గత మార్చిలో దేశీ ప్రయాణికుల సంఖ్య 1.06 కోట్లను తాకింది. అంతకుముందు నెల ఫిబ్రవరిలో నమోదైన 76.96 లక్షలతో పోలిస్తే సుమారు 38 శాతం అధికం.  వైమానిక నియంత్రణ సంస్థ డీజీసీఏ తాజా గణాంకాలివి. గత నెలలో దేశంలోని అన్ని ప్రైవేట్‌ రంగ సంస్థల ప్యాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌) 80 శాతం దాటడం గమనార్హం.

విమానాల ఆక్యుపెన్సీని తెలియజేసే పీఎల్‌ఎఫ్‌ స్పైస్‌జెట్‌లో 86.9 శాతం, ఇండిగోకు 81 శాతం, విస్తారాలో 86.1 శాతంగా నమోదైంది. ఈ బాటలో గో ఫస్ట్‌ 81.4 శాతం, ఎయిరిండియా 85 శాతం, ఎయిరేషియా ఇండియా 81.3 శాతం చొప్పున పీఎల్‌ఎఫ్‌ను సాధించినట్లు డీజీసీఏ వెల్లడించింది. అయితే కేంద్రం నిర్వహణలోని ప్రాంతీయ సంస్థ అలయెన్స్‌ ఎయిర్‌ మార్చిలో 74 శాతం పీఎల్‌ఎఫ్‌నే సాధించినట్లు పేర్కొంది. కాగా.. గత రెండేళ్లలో కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రయాణాలపై నిషేధ ఆంక్షలు విధించడంతో విమానయాన రంగం కుదేలైన విషయం విదితమే. 
     

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top