భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్యకల్యాణం శుక్రవారం ఘనంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
వైభవంగా అమ్మవారికి పుష్పాంజలి
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తులతోపాటు లక్ష్మీతాయారు అమ్మవారి ఉత్సవ మూర్తులను పల్లకీ సేవగా తీసుకొచ్చి రామ సేవా మండపంలో కొలువుదీర్చారు. వివిధ రకాల పూలతో అమ్మవారికి పుష్పాంజలి చేశారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈఓ రజనీకుమారి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
భూ సర్వే పనులు పరిశీలన
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేషన్ చిట్టిరామవరం తండాలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను శుక్రవారం అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పరిశీలించారు. సర్వే పనుల పురోగతిపై సమీక్షించి, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకున్నా రు. అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు పరస్పర సమన్వయంతో రీ సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కొత్తగూడెం తహసీల్దార్ పుల్ల య్య, కార్పొరేటర్ డాక్టర్ స్వప్న, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గెస్ట్ ఫ్యాకల్టీ మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. జాబితా ల్లో అభ్యర్థుల పేరు, విద్యార్హతలు, మెరిట్, ఇతర వివరాల్లో తప్పులు, అభ్యంతరాలు ఉంటే తగిన ధ్రువపత్రాలతో ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు భద్రాచలంలోని ఆర్సీఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వివరాలకు 85001 36628 నంబర్లో సంప్రదించాలని పీఓ ఓ ప్రకటనలో తెలిపారు.
దోమతెరల వితరణ
బూర్గంపాడు: ములుగు, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 250 ఆదివాసీ కుటుంబాలకు అందించేలా హైదరాబాద్కు చెందిన షిలోహు మిషనరీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రూ.1.25 లక్షల విలువైన దోమ తెరలను వితరణ చేశారు. శుక్రవారం సారపాక గాంధీనగర్ సియోను ప్రార్థన మందిరంలో ములుగు జిల్లాలోని తాడ్వాయి, మంగపేట, పినపాక మండలాల గల శాంతినగర్, కేఎం నగర్, ఎర్రకుంట, భద్రాద్రి జిల్లాల్లోని ములకలపల్లి మండలం పాత గుండాల పాడు, పాలవాగు ప్రాంతాల్లోని వలస ఆదివాసీ కుటుంబాల ప్రాంతాల్లో పనిచేస్తున్న పాస్టర్లకు అందజేశారు.


