క్షేత్రస్థాయిలో పరిశీలించిన
కలెక్టర్ అంకిత్
పాల్వంచరూరల్: ఏ మాత్రం తేడా రాకుండా భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పాల్వంచ మండలం నాగారం గ్రామపంచాయతీ పరిధి రేపల్లేవాడ, బోజ్యాతండాల్లో 458 ఎకరాలకు సంబంధించి సర్వే జరుగుతుండగా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేయర్లు, స్థానిక రైతుల నుంచి ఆయన వివరాలు ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వివాదాలకు తావులేకుండా సర్వే చేపడుతూ ప్రతీ భూయజమాని హద్దులను క్షేత్రస్ధాయిలో పరిశీలించి సరిపోల్చాలని ఆదేశించారు. రీసర్వేతో హద్దులు, విస్తీర్ణం వివరాలు స్పష్టంగా నమోదు కానున్నందున రైతులు కూడా సహకరించాలని తెలిపారు. తహసీల్దార్ దారా ప్రసాద్, ఆర్ఐ నళినికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేగంగా భూసేకరణ
సూపర్బజార్(కొత్తగూడెం): సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణలో వేగం పెంచాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణ, పైలట్ గ్రామాల్లో భూముల రీ సర్వే, ‘ఎస్ఐఆర్’లో నోటీసుల జారీ, విచారణపై సూచనలు చేశారు.


