తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం
అంచనా రూ.43.88 కోట్లు.. ఇప్పటికే రూ.17.56 కోట్లు విడుదల
పాత కొత్తగూడెంలో వివిధ దశల్లో 2బీహెచ్కే గృహాలు
కలెక్టర్ చొరవ చూపాలి
చుంచుపల్లి: పాత కొత్తగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతోంది. భవనాలు అసంపూర్తిగా నిలిచిపోవడంతో లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. తొమ్మిదేళ్లుగా పనులు సాగుతుండటంతో నిర్మాణ దశలోనే ఇళ్లు శిథిలాల మాదిరిగా కనిపిస్తున్నాయి. నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవనాల మధ్య పిచ్చిచెట్లు దట్టంగా పెరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 600 మంది లబ్ధిదారులను హడావుడిగా ఎంపిక చేశారు. నేటికీ ఇళ్లు పూర్తికాకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
అంచనాల్లో భారీ వ్యత్యాసం
నాటి కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం పాత కొత్తగూడెం 2బీహెచ్కే ప్రాజెక్ట్లో 840 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. డీపీఆర్లో మాత్రం 828 ఇళ్లు, 23 బ్లాకులు, జీ+2 నిర్మాణంగా పేర్కొన్నారు. రూ.43.88కోట్ల అంచనా వ్యయం ఉండగా, రూ.31.07 కోట్లకే వర్కింగ్ ఎస్టిమేట్ రూపొందించడం అనుమానాలకు తావి స్తోంది. అంచనా, వర్కింగ్ ఎస్టిమేట్ల మధ్య రూ. 12.81 కోట్ల వ్యత్యాసం ఉండటంపై సమగ్ర విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రూ.17.56 కోట్లు విడుదలైనా నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ప్రభుత్వం వెచ్చించిన నిధుల వినియోగం, పనుల పురోగతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వివిధ దశల్లో నిర్మాణాలు
ప్రాజెక్ట్ పరిధిలో 828 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 228 ఇళ్లు ప్రీ గ్రౌండింగ్ దశలో, 96 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో, 425 ఇళ్లు రూఫ్ దశలో, 43 ఇళ్లు వాలింగ్ దశలో, మరో 36 ఇళ్లు ప్లాస్టరింగ్ దశల్లో నిలిచిపోయాయి. అత్యధికంగా 425 ఇళ్లు రూఫ్ దశలోనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ప్రాజెక్టు అంచనా వ్యయం, వాస్తవ పనుల ఎస్టిమేట్, నిధుల కేటాయింపు, నిర్మాణ పనులు, నాణ్యతా ప్రమాణాలపై విచారణ, తనిఖీలు జరపాలని, ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
పాత కొత్తగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టు ప్రారంభమై తొమ్మిదేళ్లు గడిచినా నిర్మాణాలు పూర్తికాలేదు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల చుట్టూ పిచ్చిచెట్లు పెరిగి, కొన్ని ప్రాంతాలు శిథిలా వస్థకు చేరుకున్నాయి. కలెక్టర్ చొరవ చూపి నిర్మాణాలు పూర్తి లబ్ధిదారులకు ఇళ్లను అందించాలి. –కొండపల్లి శ్రీధర్,
సమగ్ర అభివృద్ధి వేదిక వ్యవస్థాపకుడు


