సూపర్బజార్(కొత్తగూడెం)/రుద్రంపూర్: విధులకు వెళ్తున్న సింగరేణి కార్మికుడిని కారు రూపంలో మృత్యువు కబళించింది. టూటౌన్ పరిధిలోని సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ఫిల్టర్బెడ్లో పంప్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న ఎస్.కోటేశ్వరరావు(55) ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి భద్రాచలం వెళ్లే కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
ప్రమాదం ముసుగులో
ఫోన్ చోరీ
ఖమ్మంక్రైం: ద్విచక్రవాహనం పైనుంచి పడినట్లు నటించిన ఇద్దరు వ్యక్తులు.. సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి నుంచి విలువైన సెల్ఫోన్ చోరీ చేసి ఉడాయించారు. ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలోని సీపీఐ కార్యాలయ కాంప్లెక్స్ వద్ద సోమవారం బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు కింద పడ్డారు. దీంతో కాంప్లెక్స్లో వ్యాపారం చేస్తున్న సాంబశివరావు ముందుకొచ్చి వారిని లేపాడు. గాయాలయ్యాయా అని వాకబు చేస్తుండగా, వారిద్దరు ఆయన నుంచి రూ.1.30లక్షల విలువైన ఐ ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. కాసేపటికి సాంబశివరావు వద్ద ఫోన్ లేకపోవడంతో షాపు ముందు ఉన్న సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా బైక్పై వచ్చిన యువకులు చోరీ చేసినట్లు తేలడంతో ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


