● ఇంటి ముందు మృతదేహం ఉంచేందుకు యజమాని నిరాకరణ ● అండగా నిలిచిన దూరపు బంధువు
పాల్వంచ: సొంతిల్లు లేకపోవడం, ఇంటి యజ మాని నిరాకరించడంతో అనా రోగ్య సమస్యలతో మృతిచెందిన వ్యక్తికి కడసారి వీడ్కోలు చెప్పేందుకు కూడా చోటులేని దుస్థితి పాల్వంచ పట్టణ పరిధి లోని బొల్లేరుగూడెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వాయిలాలకు చెందిన గుమ్మడి రాజు భిక్షపతి(50)కి ముఫ్పై సంవత్సరాల క్రితం ఓ ప్రమాదంలో రెండు కళ్ల, చేయి కోల్పోయాడు. తల్లిదండ్రుల తదనంతరం పాల్వంచ బొల్లేరుగూడెంలోని నివసించే అక్క, బావ గాదే రాములమ్మ, కొమురయ్య దంపతులు భిక్షపతిని తమ వద్దకు తీసుకువచ్చి చూసుకుంటున్నారు. వారు ఉండే అద్దె ఇంట్లో భిక్షపతి సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచేందుకు యజమాని ఒప్పుకోకపోవడంతో రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు దృష్టికి వెళ్లడంతో, అదే సంఘానికి చెందిన బంధువు గుడికందుల సమ్మయ్య, విజయలకు సమాచారం అందించారు. దీంతో సమ్మయ్య మానవతా దృక్పథంతో మృతదేహాన్ని తన ఇంటి ముందే ఉంచి అంతిమ లాంఛనాలను నిర్వహించారు. దశ దినకర్మ జరుపుకోవడానికి ఆశ్రయమిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన సమ్మయ్య కుటుంబాన్ని నాయకులు, స్థానికులు అభినందించారు.


