గతంలోనే వివరించిన ‘సాక్షి’
● పాండురంగాపురం–సారపాక లైన్ నిర్మాణంలో తొలి అడుగు ● మల్కాన్గిరి మార్గంలో తొలుత ఈ లైన్ పూర్తి చేసేందుకు సుముఖత ● రాష్ట్ర మంత్రి తుమ్మల విన్నపానికి కేంద్ర రైల్వే మంత్రి సానుకూల స్పందన
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి కొలువైన భద్రగిరికి రైలు మార్గం కల సాకారం దిశగా తొలి అడుగు పడింది. ఎన్నో ఏళ్లుగా భక్తులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు కోరుతున్న రైల్వే కనెక్టివిటీకి తాజాగా కదలిక వచ్చింది. పాండురంగాపురం–మల్కాన్గిరి రైల్వే లైన్ నిర్మాణానికి అవరోధాలు ఉన్న నేపథ్యంలో తొలుత పాండురంగాపురం నుంచి సారపాక(సాకేతపురి) వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
తొలుత పాండురంగాపురం–సారపాక వరకు
పాండురంగాపురం–మల్కాన్గిరి రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ, అటవీ అనుమతులు, గోదావరి వంతెనతోపాటు ఇతర రైల్వే వంతెనల నిర్మాణం వంటి అంశాలు ప్రధాన అవరోధాలుగా మారాయి. దీంతో నిర్మాణానికి మరికొంత సమయం పట్టే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మొత్తం లైన్ కోసం వేచి ఉండకుండా, పాండురంగాపురం–సాకేతపురి వరకై నా తొలిదశలో లైన్ నిర్మించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టి రైల్వే శాఖకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించి పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులను ఆదేశించారు. ఫలితంగా భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ కల్పించే ప్రక్రియలో ముందడుగు పడినట్లయింది. ఇది పూర్తయితే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలానికి భక్తుల రాకపోకలు పెరగనున్నాయి.
మల్కాన్గిరి–పాండురంగాపురం రైల్వే లైన్ ప్రతిపాదన, భూ సేకరణకు కేంద్ర ప్రభుత్వం 2024లో ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో తొలివిడతలోనే పాండురంగాపురం–భద్రాచలం వరకు లైన్ నిర్మించాలని, దీంతో భక్తులకు ప్రయాణం సులభతరంగా ఉంటుందని పలుమార్లు ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. ఆ దిశగానే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపుతుండటంతో భక్తులు, పర్యాటకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


