అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ, మాజీ ఉపసర్పంచ్ రాగం సత్యం(63) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామంలో చింతకుంట ప్రాంతంలో ఫారంపాండ్లో కూలీలు ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సత్యం ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆటోలో ఆర్ఎంపీ వద్య ప్రథమ చికిత్స చేయించి, భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడ ని పేర్కొన్నారు. ఎంపీడీవో ముత్యాలరావు, ఏపీఓ సీతారామయ్య ఆస్పత్రికి చేరుకుని సంతాపం తెలిపారు.
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు..
గుండాల: గుండెపోటుతో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు శనివారం మృతి చెందింది. మండలంలోని సాయన్నపల్లి గ్రామానికి చెందిన బొమ్మెర్ల లక్ష్మి (50) గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. శుక్రవారం ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆమె సాయంత్రం అస్వస్థతకు గురికాగా గుండాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కుమారు డు గతంలో గ్రామపంచాయతీ డ్రైవర్గా పనిచేస్తూ ట్రాక్టర్ బోల్తా పడి మృతిచెందాడు. ఇప్పుడామె మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్య
దుమ్ముగూడెం: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పడిగపాటి భాస్కరరెడ్డి(36) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ శ్యామ్ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డికి భద్రాచలానికి చెందిన యువతితో వివాహం జరిగింది. దంపతుల మధ్య ఇటీవల గొడవలు జరగడంతో భార్య భద్రాచలం పోలీస్స్టేషన్లో ఈ నెల 3న ఫిర్యాదు చేసింది. దీంతో స్టేషన్ నుంచి పోలీసులు ఫోన్ చేయడంతో క్షణికావేశంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


