అక్షరం నేర్పడం ఉపాధ్యాయుల విధి. ఆ అక్షరంతో జీవితాన్ని గెలిపించేలా తీర్చిదిద్దడం ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణం. అమాయకత్వంతో బడిలోకి అడుగుపెట్టిన పిల్లలను సమాజం మెచ్చే పౌరులుగా, నలుగురికీ దారిచూపే విజేతలుగా తీర్చిదిద్దే అద్భుత శిల్పులు ఉపాధ్యాయులు. పాఠాలకే పరిమితం కాకుండా కష్టాల్లో ధైర్యం నూరిపోయడం, కలలకు రెక్కలు తొడిగి బతుకు బాటలో వెలుగుదివ్వెలుగా నిలిచే ప్రత్యక్ష దైవాలే గురువులు. నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు విద్యార్థులను పలకరించగా.. వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన ఉపాధ్యాయుల ప్రత్యేకతలను వివరించారు.
● ఉపాధ్యాయులే సమాజ వెలుగుదివ్వెలు ● విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతున్న టీచర్లకు వందనం
విద్యాబోధనతో పాటు మానసిక పరిణితి, శారీరక దారుఢ్యం, సమాజాన్ని చదవగలిగే ప్రజ్ఞను పిల్లలకు అందించే బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉంటుంది. ఇందుకోసం ఉపాధ్యాయులు విద్యార్థి స్థాయికి వెళ్లి వారికి అర్థమయ్యే భాషలో, వీలైతే ప్రయోగాత్మక బోధన అవలంబిస్తే పిల్లలకు మేలు జరుగుతుంది. ఉపాధ్యాయులు పిల్లలందరికీ మంచి భవిష్యత్ను అందించడమే కాక తమ వైపు నుంచి భరోసా అందిస్తూ ధైర్యంగా ముందడుగువేసేలా మార్గనిర్ధేశం చేయాలి. విద్యార్థిలోని మంచి గుణాలను వెలికితీసి ఏ దారిలో వెళ్లాలనుకుంటున్నారో గుర్తించి తనదైన శైలిలో ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్ర ఉపాధ్యాయులదే. అంతేకాక క్రమశిక్షణ, మంచి అలవాట్లు పెంపొందిస్తే విద్యార్థుల విజయానికి బాటలు పడతాయి.
– అశ్వారావుపేటరూరల్/ఇల్లెందు రూరల్


