ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
కొత్తగూడెం, ఇల్లెందులో వంటావార్పుతో నిరసన
సూపర్బజార్(కొత్తగూడెం)/ఇల్లెందు: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాఫ్ అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రుల ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అందిన కాడికి దోచుకుంటున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దశలవారీ ఆందోళనలలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ధర్నాచౌక్లో వంటా వార్పు నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి భోజనాలు చేశారు. ఇల్లెందు జగదాంబా సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట కూడా వాంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా హామీలు అమలు చేయడంలేదన్నారు. రైతులకు యూరియా కూడా ఇవ్వలేకపోతోందని అన్నారు. పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టి అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి కనీసం జిల్లాకు సాగునీరు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అవమానించిందని ఆరోపించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వద్దిరాజు కొత్తగూడెం ప్రజలకు అండగా ఉంటారని, ప్రజాభీష్టం మేరకు రాబోయే ఎన్నికల్లో ఆయన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్, కార్పొరేటర్లు సింధు తపస్వి, గుణ చరిత్, రాంబాబు, మధు చంద్, సాగర్, శ్రీవల్లి, వీరమ్మ, నాయకులు ఎండీ జాఫర్, శీలం రమేష్, ఎస్ రంగనాధ్, దేవీలాల్, సత్యనారాయణ, కిలారు నాగేశ్వరరావు, కొట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


