భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. స్వామివారి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ కృష్ణా జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి అభిషేకం జరిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సేవా మండపంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, పూజలు జరిపారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం జరిపారు. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు.
జిల్లాస్థాయి ఉత్తమ
ఉపాధ్యాయుల ఎంపిక
కొత్తగూడెంఅర్బన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్నీ కేటగిరీల్లో కలిపి మొత్తం 50 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. శుక్రవారం డీఈఓ డి.వాసంతి వివరాలు వెల్లడించారు. వీరందరినీ శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం క్లబ్లో సన్మానించనున్నారు. ఆహ్వాన కమిటీ చైర్మన్, కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే వేడుకలకు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని డీఈఓ తెలిపారు.
కేటగిరీల వారీగా
పీజీహెచ్ఎం/ఎంఈఓ కేటగిరీలో ఐదుగురు ఎంపికయ్యారు. ఎస్ఏ కేటగిరీలో 18 మంది, ఎస్జీటీ కేటగిరీలో 17 మంది, బెస్ట్ పెర్ఫార్మింగ్ ఎంప్లాయీస్ విభాగంలో 10 మందిని ఎంపిక చేశారు. ఇక రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులకు హైదరాబాద్లో అవార్డులు అందజేసి సన్మానించనున్నారు.


