టేకులపల్లి: సామాన్య, పేద ప్రజలకు న్యాయాన్ని మరింత చేరువ చేసేందుకు నల్సా 60 రోజుల మెగా డ్రైవ్లో భాగంగా టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామంలో ‘విలేజ్ లీగల్ ఎయిడ్ క్లినిక్’(గ్రామ న్యాయ సహాయ కేంద్రం)ను ఏర్పాటు చేశారు. బుధవారం ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి ఎం.రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘న్యాయం పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు‘అని స్పష్టం చేస్తూ, ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించడంలో ఈ కేంద్రాలు మైలురాయిగా నిలుస్తాయన్నారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యాన స్థానిక ప్రజల కోసం ఏర్పాటు చేసిన ‘గొర్రెల పెంపకం శిక్షణ యూనిట్’ను ప్రారంభించి వారి ఆర్థిక స్వావలంబనకు సరికొత్త బాటలు వేశారు. అనంతరం స్వయంగా గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలపై ఆరా తీశారు. చట్టాలపై అవగాహనతో పాటు ఉపాధి మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని, చట్టపరమైన రక్షణ, ఆర్థిక ప్రోత్సాహం ఒకే వేదికపై లభించడం రోళ్లపాడు గ్రామ అభివృద్ధికి సరికొత్త మార్గం సుగమం చేసిందన్నారు. న్యాయ వ్యవస్థ, సంక్షేమ శాఖల భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాఘవమ్మ, కార్యదర్శి రాజు, నాయకులు నాగరాజుతో పాటు ఐటీడీఏ సిబ్బంది, పారా లీగల్ వలంటీర్లు ఎన్.చరణ్కుమార్, బి.భారతి, పి.రాజకుమారి, సతీష్ ఖండేల్వాల్ పాల్గొన్నారు.


