భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. మంగళవారం సందర్భంగా అభయాంజనేయస్వామి ఉపాలయంలో అభిషేకం, తమలపాకులతో అర్చన జరిపారు.
ఓటర్ల సవరణ ప్రక్రియ
వేగవంతం చేయాలి
భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్
మణుగూరు రూరల్: ఓటర్ల సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ, పినపాక నియోజకవర్గ ఈఆర్ఓ బి రాహుల్ సూచించారు. మంగళవారం మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దా ర్లు, ఎంపీడీఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నోటీసుల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. నోటీస్ అందిన ఏడు రోజుల తర్వాత విచారణ చేపట్టి క్లెయిమ్లు, అభ్యంతరాలపై నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మణుగూరు తహసీల్దా ర్ అద్దంకి నరేష్, డీటీ రామారావు పాల్గొన్నారు.
సింగరేణి ఏజీఎంలకు ఉద్యోగోన్నతి
రుద్రంపూర్: సింగరేణి యాజమాన్యం ముగ్గురు ఏజీఎంలకు జీఎంలుగా పదోన్నతి కల్పించి బదిలీచేసింది. ఈ మేరకు మంగళవారం ఈఈసెల్ జీఎం ఏజే మురళీధర్రావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో రామగుండం రీజియన్లో జీఎం సేఫ్టీ విభాగం ఏజీఎం మల్లారపు మల్లయ్యను కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా, బెల్లంపల్లి ఏజీఎం మిక్కిలినేని శ్రీరమేష్ను డైరెక్టర్ పీపీ కార్యాలయం జీఎంగా, కార్పొరేట్ ఐఅండ్పీఎం కార్యాలయ ఏజీఎం ఎంవీ. నర్సింహారావును డైరెక్టర్ (పీపీ) కార్యాలయ జీఎంగా పదోన్నతి కల్పిస్తూ బదిలీచేశారు. సివిల్ విభా గంలో మరో ఆరుగురు అధికారులను కూడా బదిలీ చేశారు. వీరందరూ ఈ నెల 5వ తేదీలో గా వారికి కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని ఈఈసెల్ జీఎం సూచించారు.
ఫామ్ పాండ్ పరిశీలన
దుమ్ముగూడెం: మండలంలోని ఎర్రబోరు, ఆర్లగూడెం గ్రామాల్లో నిర్మించిన ఫామ్పాండ్లను జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి మంగళవారం పరిశీలించారు. రైతులు ఫామ్పాండ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని, వీటితో భూగర్భలాలు పెరుగుతాయని అన్నారు. అనంతరం కొత్తపల్లి పంచాయతీలో నిర్మిస్తున్న వీవో భవనాన్ని పరిశీలించారు. ఎంపీడీవో వివేక్రామ్, ఏపీఓ సుకన్య, ఏపీఎం జగదీష్ పాల్గొన్నారు.
12న జాతీయ లోక్ అదాలత్
సూపర్బజార్(కొత్తగూడెం): ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. కక్షిదారులు తమ పెండింగ్ కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్లో అవకాశం లభిస్తుందని అన్నారు. చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహారం, వివాహ బంధానికి సంబంధించిన వివాదాలు, ఆస్తి పంపకాల వివాదాలు, అద్దె వివాదాలు, ఇతర సివిల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ–చలాన్, సైబర్ క్రైమ్, తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
ఖమ్మం మెడికల్ కాలేజీలో
జాతీయ కోటా సీట్ల భర్తీ
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జాతీయ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్ర కోటా 85 శాతం, జాతీయ కోటా కింద 15 శాతం సీట్లు కేటాయించారు. ప్రస్తుతం జాతీయ కోటా సీట్లు భర్తీ కాగా, ఈనెల 26వ తేదీ లోపు రాష్ట్ర కోటా సీట్లు కూడా భర్తీ అయ్యే అవకాశముందని ప్రిన్సిపాల్ డాక్టర్ శంకర్ తెలిపారు. మూడు విడతల్లో కౌన్సెలింగ్ పూర్తయితే తప్ప జాతీయ కోటాకు సంబంధించి చేరే విద్యార్థుల వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఈసారి ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతోందని తెలిపారు. విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ప్రవేశాలు ఖరారు చేస్తామని వివరించారు.


