భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం స్వామివారి నిత్యకల్యా ణం రమణీయంగా జరిగింది. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
నేడు కేంద్ర బృందం పర్యటన
భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియాఆస్పత్రి లో మంగళవారం కేంద్ర బృందం పర్యటించనుంది. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యం, నిర్వహణలో క్వాలిటీ, వైద్యులు, సిబ్బంది పనితీరు, మందుల లభ్యత తదితర అంశాలను పరిశీలించే అవకాశం ఉంది.
మొక్కలు నాటి
పరిరక్షించాలి
కొత్తగూడెంఅర్బన్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు తెలిపారు. సోమవారం జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణంలో వన మహోత్సవం, శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు పెంచి వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని, వేడిని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. అనంత రం మొక్కల రాజశేఖర్ను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు సూరేపల్లి లలిత కుమారి, మణిమృదుల, సిబ్బంది పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలను నిరోధించాలి
ఎస్పీ రోహిత్ రాజు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో మాదకద్రవ్యాలను నిరోధించాలని ఎస్పీ రోహిత్రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం చేసి, చార్జిషీట్లను దాఖలు చేయాలని ఆదేశించారు. పరారీలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేయాలన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తుల ఆర్థిక లావాదేవీలు, అక్రమంగా సంపాదించిన ఆస్తులపై సమగ్ర ఆర్థిక దర్యాప్తు చేపట్టాలని చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, బాధితులను డీ అడిక్షన్ కేంద్రాలకు పంపించాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు బాధ్యతతో పనిచేయాలని, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్ కుమార్, రవీందర్ రెడ్డి, వెంకన్న బాబు, మల్లయ్య స్వామి, అరుణ్ కుమార్, సీఐలు పాల్గొన్నారు.
సమాజ సేవ చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): సమాజ సేవకు యువత ముందుకు రావాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ అవగాహన పోస్టర్ను సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించి మాట్లాడారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలు, సభ్యులు రాజేష్, జుబ్బు, రాజయ్య పాల్గొన్నారు.


