భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
గోదావరికి నదీహారతి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి తీరంలో ఆదివారం భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో నదీహారతి నిర్వహించారు. గణపతి పూజ, 108 ప్రమిదలతో దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన, శ్రీరామ నామస్మరణ జరిపారు. అర్చకులు రామ వజ్జల రవికుమార్, అశోక్ కుమార్ శర్మ, కారంబరీ కృష్ణశర్మ, రామాచార్యులు, ఫణికుమార్ శర్మ, సత్యప్రసాద్ శర్మ, తేజశర్మ పాల్గొన్నారు.


