అశ్వారావుపేటరూరల్: మండలంలోని తిరుమలకుంట ఎస్టీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం ప్రహరీకి ఆనుకుని ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి గుంతను ఎట్టకేలకు పూడ్చి వేశారు. ఈ నెల 3వ తేదీన ‘గుంత.. చిన్నా రుల చింత’శీర్షికతో ‘సాక్షి’లో కథనం వెలువడింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ కోర్సా రాజేశ్, కార్యదర్శి కార్తీక్ ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో ఆదివారం మురుగునీటి గుంతకు కాలువ తీసి, తరవాత దాన్ని పూడ్చి వేశారు. దీంతో తల్లిదండ్రలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన వాహనం
జూలూరుపాడు: మండలంలోని సాయిరాంతండా సమీపంలో భద్రాచలం రాష్ట్రీయ రాహదారిపై ఆర్టీసీ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఐషర్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆర్టీసీ బస్సు, ఐషర్ వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు ఆరా తీశారు.


