ఏజెన్సీ యువత క్రీడల్లోనూ రాణించాలి
చర్ల: ఏజెన్సీ ప్రాంతంలోని యువత చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎస్పీ రోహిత్రాజుతో కలిసి మండలంలోని ఉంజుపల్లి రోడ్లో సమీపంలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. రూ.75 లక్షలతో నూతనంగా నిర్మించిన మైదానాన్ని యువత వినియోగించుకోవాలన్నారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆదివాసీ ప్రజలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను అందించేందుకు ఇతర శాఖల సమన్వయంతో పోలీస్ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు జిల్లాస్థాయికి ఎంపికవుతారని అన్నారు. కాగా ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, క్యారమ్స్, బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు శ్రీనివాస్, రాజువర్మ, డీవైఎస్ఓ పరంధామ రెడ్డి, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ పాల్గొన్నారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తనిఖీ
చర్లలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలపై ఆరా తీశారు. మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధుల కేసులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విభాగాన్ని, వివిధ రకాల రిజిస్టర్లను పరిశీలించారు. బాధితులకు నిరంతరం వైద్యం అందించాలన్నారు. బాధితులతో మాట్లాడి మందులు సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అన్ని రకాల మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయి వర్ధన్, వైద్యులు కాంత్, రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు
ప్రజలకు అవగాహన కల్పించాలి
దుమ్ముగూడెం: రోడ్డు ప్రమాదాల, సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. శుక్రవారం ఆయన దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ప్రహారిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్టేషన్ పరిసరాలను ఎల్ల ప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సిబ్బంది సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై గణేష్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


